అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవీ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. కా అంటే లక్ష్మీ మా అంటే సరస్వతి అక్షి అంటే కన్ను…. కామాక్షి దేవి అంటే లక్ష్మీదేవి, సరస్వతీ దేవిని కన్నులుగా కలది అని అర్థం. తమిళనాడు రాష్ర్టంలోని కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధికెక్కింది. పుష్పేషు మల్లి.. పురుషేషు విష్ణు.. నారీషు రంభ.. నగరేషు కంచి.. అని మహాకవి కాళిదాసు వర్ణించారు. పువ్వులలో అత్యున్నతమైనది మల్లె అని, పురుషులలో ఉత్తమోత్తముడు శ్రీ మహా విష్ణువని, స్త్రీలలో అందమైన వనిత రంభ అని, నగరాల్లో మహోన్నతమైనది కాంచీపురం అని దీనర్థం.
ఇక్కడ వెలసిన శ్రీ కామాక్షి అమ్మవారికి కుడి ఎడమలుగా లక్ష్మీ, సరస్వతులు వింజామరలు వీస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో అమ్మవారు ఏడు సంవత్సరాల బాల రూపంలో అవతరించారని చెబుతారు. కామాక్షిదేవి ఇక్కడ కారణ, బింబం, సూక్ష్మం అనే మూడు రూపాలలో విశిష్ట పూజలు అందుకుంటున్నారు. భారతదేశంలోనే సప్త మోక్షపురాలలో కంచి క్షేత్రం ఒకటి. దశరథ, తుండీర, శ్రీ కృష్ణదేవరాయలు, చోళ రాజులు, ఇక్ష్వాకు వంశస్థులు అమ్మవారిని ఆరాధించినట్లు చరిత్ర చెబుతోంది. పద్మాసనంలో కూర్చున్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.
అమ్మవారు కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేయగా .. అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబనది రూపంలో వచ్చాడట. దేవిని పరీక్షించేందుకు అలల ఉద్ధృతిని పెంచగా ఆ దేవి తన రెండు చేతులలో విగ్రహాన్ని ఉంచుకుని అలల నుంచి కాపాడిందని ఇక్కడి స్థల పురాణం. దేవి సూది మొనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి సంతసించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్టు చెబుతారు.కామాక్షి దేవి ఆలయాన్ని గాయత్రీ మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీకామాక్షి, శ్రీబిలహాసం, శ్రీచక్రం అనే మూడు రూపాలలో దర్శనమిస్తారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లు మలిచారు. దేవి తన చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరకుగడలతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడి అమ్మవారు చాలా ఉగ్రరూపంలో బలి కోరుతుండటంతో.. ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు.
ఇక్కడ ఆ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి.అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్లొద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆయన అనుమతి తీసుకుని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది.ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీకామాక్షి దేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకుని వస్తారు. ఆ తర్వాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు.
అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. కామాక్షీదేవి ఇక్కడ ఐదు రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రీ మంటపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో నాలుగు గోడలను నాలుగా వేదాలుగా, 24 స్తంభాలను గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో నాలుగు రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు.
అమ్మవారికి పౌర్ణమి రోజున నవావర్ణ పూజ, ప్రతీ బుధవారం చందనకాపు పూజ, రోజూ మూడు సార్లు అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమార్చన, దేవి అలంకరణ చేస్తారు. నవరాత్రులను మూడు విభాగాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు. మొదటి మూడు రోజులు దుర్గాదేవిని,తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని, చివరి మూడు రోజులు సరస్వతీ దేవిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తారు. ఆ సమయంలో కన్య, సుహాసిని పూజలను విశేషంగా చేస్తారు. వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు. దేవీ నవరాత్రులలో ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
కామాక్షి అమ్మవారికి ప్రతి ఏటా మార్చి నెలలో పెద్దఎత్తున రథోత్సవం నిర్వహిస్తారు.ఈ రథోత్సవంలో భాగంగా చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు.కంచి పర్యాటక క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందినది. పలార్ నది ఒడ్డున వెలసిన కాంచీపురంలో పురాతన ఆలయాలు ఉన్నాయి. కామాక్షి అమ్మవారి దేవాలయంతో పాటు ఏకాంబరనాథన్, వరదరాజ పెరుమాళ్, ఉలగలంద పెరుమాళ్, కుమార కొట్టం, కైలాసనాథర్, కాంచీపురేశ్వర దేవాలయాలను చూడవచ్చు.
కంచిలో భక్తులు బస చేసేందుకు దేవాలయానికి చెందిన సత్రాలు, ఇతర అతిథి గృహాలు ఉన్నాయి. మరెన్నో ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయి.కంచి పట్టు చీరలకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ శిల్కు సొసైటీలు ఉన్నాయి. వివిధ రకాలకు చెందిన శిల్కు వస్త్రాలు, ముఖ్యంగా చీరలు ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ కంచి కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఇక్కడకు నిత్యం దేశ, విదేశాలకు చెందిన యాత్రికులు, వ్యాపారులు, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కంచీపురానికి వెళ్లాలంటే ముందుగా తిరుపతి లేదా చిత్తూరుకు చేరుకోవాలి. అక్కడి నుంచి నేరుగా బస్సుల్లో వెళ్లవచ్చు. లేదంటే నేరుగా చెన్నై వెళ్లి అక్కడి నుంచి కంచికి చేరుకోవచ్చు. చెన్నై నుంచి కంచి 65 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది.
Discussion about this post