గల్ఫ్ దేశమైన ఖతార్లో స్థానిక ప్రాధమిక న్యాయస్థానం ‘ఖతార్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్’ ఇచ్చిన తీర్పు భారత్ కు షాక్ ఇచ్చింది. గూఢచర్యం ఆరోపణలపై భారత నౌకాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. దీనిపై భారత విదేశాంగశాఖ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈ కేసుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని, తమ ముందు న్యాయపరంగా ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపింది.
ఖతార్కు చెందిన అల్ దహ్రా కంపెనీలో భారత నౌకా దళ మాజీ అధికారులైన కమాండర్ పాకాల సుగుణాకర్, కెప్టెన్ నవ్తేజ్ సింగ్ గిల్, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ పూర్ణేందు తివారీ, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ సంజీవ్ గుప్తా, కమాండర్ అమిత్ నాగ్పాల్, రాగేశ్ కీలక బాధ్యతలు నిర్వహించేవారు. వీరిని గత ఏడాది ఆగస్టులో రాజధాని దోహాలో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు చేశారు. విచారణ అనంతరం స్థానిక కోర్టు మరణశిక్ష విధిస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది.
అల్ దహ్రా కంపెనీకి చెందిన ఎనిమిది మంది భారతీయ ఉద్యోగులకు స్థానిక కోర్టు మరణశిక్ష విధించారని తెలిసి దిగ్భ్రాంతి చెందినట్టు భారత విదేశాంగశాఖ తెలిపింది. పూర్తి తీర్పు కోసం వేచి చూస్తున్నామని, వారి కుటుంబ సభ్యులతోను, న్యాయబృందంతోను సంప్రదిస్తున్నామని వెల్లడించింది. ఖతార్ అధికారులతోనూ మాట్లాడతామని తెలిపింది. బాధితులు నౌకాదళంలో 20 ఏళ్లపాటు మచ్చలేని సేవలందించి, ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారని, అనంతరం స్వచ్ఛంద పదవీ విరమణ చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఖతార్లో మరణశిక్షకు గురైన 8మందిలో అత్యధికులు 60 ఏళ్లకు పైబడినవారే. కొందరు భారత నౌకాదళానికి చెందిన ముఖ్యమైన యుద్ధనౌకలకు సారథ్యం వహించారు. వీరందరూ ఖతర్లోని అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే ప్రైవేటు కంపెనీలో కొంతకాలంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కంపెనీ ఖతర్ నౌకాదళానికి శిక్షణ, సహకారం అందిస్తోంది. ఇటలీ టెక్నాలజీ ఆధారిత జలాంతర్గాములను నిర్మించే ఒక రహస్య ప్రాజెక్టు కోసం ఈ కంపెనీ.. 8మంది భారతీయ నౌకాదళ మాజీ అధికారులను ఉద్యోగులుగా నియమించుకుంది.
అయితే, ఇజ్రాయెల్కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో ఈ 8 మందిని గత ఏడాది ఆగస్టు 30న ఖతార్ నిఘా విభాగం అరెస్టు చేసింది. ఈ ఏడాది మార్చి 29 నుంచి న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. గురువారం వారికి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. వీరిలో పాకాల సుగుణాకర్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నానికి చెందిన వారు. ఈ పరిణామంతో బాధితుల కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
Discussion about this post