గూఢచర్యం ఆరోపణలపై భారత నౌకాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు
ఖతార్ కోర్ట్ విధించిన మరణ శిక్ష తప్పుతుందన్న ఆశలు చిగురిస్తున్నాయి. కోర్టు విధించిన మరణశిక్షపై భారత్ ప్రభుత్వం అప్పీల్ చేయడమే ఇందుకు కారణం. తీర్పుపై అప్పీల్ చేసిన విషయాన్ని ఢిల్లీలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ వెల్లడించారు.
బాధితులు ఎనిమిది మందితో సంప్రదింపులు జరిపే అవకాశం దోహా నగరంలోని భారతీయ ఎంబసీ దౌత్యాధికారులకు లభించిందని అరీందమ్ బాగ్చీ చెప్పారు. వారికి న్యాయ, దౌత్యపరమైన పూర్తి రక్షణ కల్పించటానికి భారత ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇటీవలే బాధితుల కుటుంబసభ్యులను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్వయంగా కలిసి ధైర్యం చెప్పారని బాగ్చీ వెల్లడించారు. కేసు సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని సంచలనాల కోసం లేనిపోని రాద్దాంతాలు చేయవద్దని.. వక్రభాష్యాలు చెప్పవద్దని విజ్ఞప్తి చేశారు.
ఖతార్కు చెందిన అల్ దహ్రా కంపెనీలో భారత నౌకా దళ మాజీ అధికారులైన కమాండర్ పాకాల సుగుణాకర్, కెప్టెన్ నవ్తేజ్ సింగ్ గిల్, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ పూర్ణేందు తివారీ, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ సంజీవ్ గుప్తా, కమాండర్ అమిత్ నాగ్పాల్, రాగేశ్ కీలక బాధ్యతలు నిర్వహించేవారు. వీరిని గత ఏడాది ఆగస్టులో రాజధాని దోహాలో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు చేశారు. విచారణ అనంతరం స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది.
మరణశిక్షకు గురైన 8మందిలో అత్యధికులు 60 ఏళ్లకు పైబడినవారే. కొందరు భారత నౌకాదళానికి చెందిన ముఖ్యమైన యుద్ధనౌకలకు సారథ్యం వహించారు. వీరందరూ అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాలు చేసేవారు. ఈ కంపెనీ ఖతర్ నౌకాదళానికి శిక్షణ, సహకారం అందిస్తోంది. కోర్టు తీర్పు అనంతరం సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేసింది. సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిని స్వదేశాలకు పంపేసింది.
Discussion about this post