కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంలో వార్షిక వేడుకలు ప్రారంభమయ్యాయి. మండల మకర విళక్కు పండగ సీజన్ ప్రారంభం కావడంతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేరళ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని తెరిచారు. స్వామివారికి మండల పూజ, మకర జ్యోతి కోసం దర్శనాలు మొదలుపెట్టారు. దీంతో శబరిమల క్షేత్రానికి భారీగా అయ్యప్ప భక్తులు చేరుకుంటున్నారు.
శబరిమల అయ్యప్ప స్వామికి ఒక్క కేరళ రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా భక్తులు, మాలధారులు వస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామివారిని దర్శించుకోవడానికి అయ్యప్ప సన్నిధానం, పంబ వద్దకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామి మండల పూజ డిసెంబర్ 27వ తేదీన జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక పూజలు స్వామివారికి నిత్యం నెయ్యితో అభిషేకాలు నిర్వహించనున్నారు.
ఇక డిసెంబర్ 31వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం జనవరి 15వ తేదీ వరకు అయ్యప్ప స్వామి వారికి మకర జ్యోతి పూజలు కొనసాగుతాయి. మకర సంక్రాంతి రోజున సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మకర జ్యోతి దర్శనంతో వార్షిక ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకుంటాయి. అత్యంత ఘనంగా అయ్యప్ప వార్షిక వేడుకలు జరుగుతాయి.
అయ్యప్ప ఆలయానికి భక్తుల సందడి కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసిన ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు శబరిమల వద్ద ఆరు దశల్లో 13 వేల మంది పోలీసులను మోహరించారు. వృద్ధులు, చిన్నారులకు స్వామి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.
Discussion about this post