తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అధిష్టానం శుక్రవారం వెల్లడించిన రెండో జాబితాలో ఒక్కరి పేరే ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. వివిధ కారణాల వల్ల మూడో జాబితా విడుదలపై ప్రతిష్టంభన కొనసాగేలా కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ నాయకులతో కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా శుక్రవారం జరిపిన భేటీలో పలు స్థానాల అభ్యర్థుల విషయమై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ మరికొన్ని స్థానాల విషయంలో తుది నిర్ణయానికి రాలేకపోయారని అంటున్నారు. ఫలితంగా రెండో జాబితాలో మహబూబ్ నగర్ టికెట్ ను ఏ.పీ. మిథున్ రెడ్డికి ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో మూడో జాబితా విడుదలకు మరో రెండు మూడు రోజులు పట్టవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను 52 మంది పేర్లతో బీజేపీ నాయకత్వం ఇదివరకే ప్రకటించింది. వీరిలో 12 మంది మహిళలు ఉన్నారు. ముగ్గురు ఎంపీలను కూడా బరిలోకి దింపుతోంది. మలి జాబితాను త్వరలోనే అధిష్టానం ప్రకటిస్తుందని పార్టీ అగ్ర నేతలు అప్పట్లో చెప్పారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన జన సేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి .కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకుడు కె.లక్ష్మణ్ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో సమావేశమై చర్చలు జరిపారు.
తెలంగాణాలో 32 లేదా 33 స్థానాల నుంచి పోటీ చేయాలని జన సేన నేతలు భావిస్తున్నారు. దీనిపై పార్టీ అధినేతకు వివరాలు సమర్పించారు. తెలంగాణలో కలిసి పోటీ చేద్దామని బీజేపీ నేతలు ప్రతిపాదించడంతో ఈ విషయమై చర్చించేందుకే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. మరోసారి చర్చలు జరిపి ఏకాభిప్రాయానికి రావాలని అమిత్ షా అటు బీజేపీ నేతలకు.. ఇటు జన సేన అధినేతకు చెప్పినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ వచ్చిన అమిత్ షా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో దాదాపు 40 స్థానాల అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరినట్టు చెబుతున్నారు. జన సేనతో అవగాహన ఫైనలైజ్ అయ్యాకే వీరి జాబితాను వెల్లడించాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే రెండో జాబితాను ఒక్క అభ్యర్థికే పరిమితం చేసారని అంటున్నారు.
Discussion about this post