నియోజకవర్గం ఏదైనా గెలుపు మాదేనని ధీమాగా ఉండే రాజకీయ నాయకులు అరుదుగా ఉంటారు. విస్తృత పరిచయాలు ఉండటం, జనంలోకి చొచ్చుకెళ్లటం, అద్భుతమైన వ్యూహాలు పన్నటం, వాటిని పకడ్బందీగా అమలు చేయటంలో తిరుగులేని వారే ఇలాంటి అరుదైన విజయాలు సాధిస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న అధికార బీఆర్ఎస్ నాయకులు కొందరు ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించి ఔరా అనిపిస్తున్నారు. వారి గురించి తెలుసుకుందాం…
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 1985 సార్వత్రిక ఎన్నికల్లో సిద్దిపేట నుంచి తొలి విజయం సాధించారు. 1989, 1994, 1999 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2001 ఉప ఎన్నికలోను.. తర్వాత 2004 ఎన్నికల్లోనూ గెలిచారు. 2014 లో గజ్వేల్ నుంచి పోటీ చేసి సీఎం అయ్యారు. 2018లోనూ గజ్వేల్ నుంచే గెలిచారు. మూడోసారీ అక్కడ నుంచి పోటీ చేస్తు న్నారు. ఈసారీ గెలిస్తే రెండు నియోజకవర్గాల్లో హ్యాట్రిక్ సాధించిన నేతగా చరిత్రలో నిలుస్తారు. కామారెడ్డి నుంచి కూడా అయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రతికూల పరిస్థితులలోను విజయం సాధించిన నేతలలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకరు. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో పాలకుర్తి నుంచి విజయం సాధించి రెండు నియోజకవర్గాల నుంచి హ్యాట్రిక్ సాధించిన నాయకుడిగా రికార్డు నెలకొల్పారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు చేవెళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు మహేశ్వరం నుంచి 2009, 2018 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2000 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికలోను, 2004 సార్వత్రిక ఎన్నికల్లోను విజయం సాధించారు. ఇప్పుడు మహేశ్వరం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు.
ముచ్చటగా మూడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించిన నేతగా బాజిరెడ్డి గోవర్ధన్ నిలిచారు. 1999 లో ఆర్మూర్ నుంచి గెలుపొందారు. 2004లో బాన్సువాడ నుంచి.. 2014, 2018 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుంచి గెలుపొందారు. ఇప్పుడు హ్యాట్రిక్ విజయం కోసం పోటీ పడుతున్నారు.
సనత్ నగర్ నియోజక వర్గం నుంచి హ్యాట్రిక్ విజయం కోసం తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం పోటీ పడుతున్నారు. 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి వర్గంలో స్థానం సంపాదించిన ఆయన.. అంతకుముందు సికింద్రాబాద్ నుంచి మూడు సార్లు విజయం సాధించారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మొదట అసిఫ్నగర్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1994, 1999, 2004 ఎన్నికల్లో విజయం దక్కించుకుని హ్యాట్రిక్ సాధించారు. తర్వాత ఖైరతాబాద్ నుంచి 2009, 2018 ఎన్నికలలో గెలుపొందారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ 2009 నుంచి ఎస్సీ నియోజక వర్గం ధర్మపురి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004 ఎన్నికలలోను, 2008 ఉప ఎన్నికలోను మేడారం నుంచి గెలుపొందారు. 2009 నుంచి నాలుగు సార్లు జరిగిన ఎన్నికల్లో ఓటమే చవిచూడలేదు. ఇప్పుడు ఏడోసారి విజయం కోసం ధర్మపురి నుంచి పోటీ చేస్తున్నారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య 1994లో పాలేరు నుంచి నెగ్గారు. తర్వాత 2009, 2014, 2018 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. ప్రస్తుతం మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఇబ్రహీంపట్నం నుంచి మంచిరెడ్డి కిషన్రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. తర్వాత 2004 ఎన్నికల్లో మలక్పేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు.
మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి 2004లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని రామాయంపేట నుంచి గెలిచారు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో రామాయంపేట నియోజకవర్గం రద్దవటంతో మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో నెగ్గిన ఆమె ఇప్పుడు హ్యాట్రిక్ విజయం కోసం బరిలోకి దిగుతున్నారు.
Discussion about this post