ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ జనసేన అధికారికం గా పొత్తు కుదుర్చుకుని జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు ను అరెస్ట్ చేయడాన్ని తప్పుబడుతూ దాన్ని రాజకీయ అస్త్రం గా మలుచుకునేందుకు టీడీపీ కృషి చేస్తోంది. ఇక వైసీపీ సర్కార్ బాబు అవినీతిని ఎత్తిచూపుతూ విమర్శలు చేస్తూ .. వరుస కార్యక్రమాలు చేపడుతోంది.
సీఎం జగన్ ఎన్నిక ల సమరశంఖం పూరించి వివిధ కార్యక్రమాలతో ముందుకు సాగుతుండగా … విపక్షనేత చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారనే ఉత్కంఠతో టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. పార్టీని ముందుకు నడిపే విషయం లో టీడీపీ నేతలకు, కార్యకర్తలకు మార్గదర్శనం చేసేవారు లేరు లేకపోవడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వైశ్రాయ్ ఎపిసోడ్ తరువాత 1995లో సెప్టెంబర్ 1న చంద్రబాబు ఏపీ ఉమ్మడి రాష్ట్ర సీఎం అయ్యారు. కాంగ్రెస్ లో మంత్రిగా పని చేసి..టీడీపీలో చేరిన నాటి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారనే ఆరోపణలు ఇప్పటికీ తప్పటం లేదు. 1983 లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాత 9 నెలలకే జరిగిన ఎన్నికల్లో 202 సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో 1985లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచింది. వరుసగా రెండు ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన ఖ్యాతి ఎన్టీఆర్ కి మాత్రమే దక్కుతుంది. 1999 సెప్టెంబర్ లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తిరిగి 181 సీట్లతో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో ఉండగా గెలిచిన ఏకైక ఎన్నిక అది మాత్రమే. 2004లో అలిపిరి ఘటన తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు పరాజయం పాలయ్యారు. సానుభూతి వర్కౌట్ కాలేదు. కాంగ్రెస్ నేత వైఎస్సార్ సీఎం అయ్యారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో మహా కూటమితో వైఎస్సార్ ను ఓడించే ప్రయత్నం చేసారు. కానీ, వైఎస్సార్ సింగిల్ గా పోటీ చేసి కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తెచ్చారు.
ఇలా వరుసగా పదేళ్ల పాటు చంద్రబాబు అధికారానికి దూరమయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం నాటి పరిస్థితుల్లో బీజేపీ, జనసేనతో కలిసి చంద్రబాబు ఏపీ సీఎం అయ్యారు. 2019 వరకు పదవిలో కొనసాగారు. ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ ఘోర పరాజయం పాలైంది. 151 సీట్లతో వైసీపీ నేత జగన్ అధికారంలోకి వచ్చారు.2024లో తిరిగి పార్టీని అధికారం లోకి తీసుకురావాలని చంద్ర బాబు ప్రయత్నాలు చేస్తుండగానే స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. వరుసగా ఇతర కేసులు కూడా వచ్చి పడ్డాయి. ఊహించని ఈ పరిణామం టీడీపీ నేతలను,క్యాడర్ అయోమయం లో పడేసింది. అక్రమంగా అరెస్ట్ చేశారని .. జగన్ కక్ష సాధిస్తున్నారని తెలుగు దేశం ప్రచారం చేస్తోంది. దీని వలన బాబు పట్ల కొంత సానుభూతి ఏర్పడుతుందని .. ఎన్నికల్లో అది ఓట్ల వర్షం కురిపిస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక జగన్ తాను చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధృడ విశ్వాసంతో ఉన్నారు. అందుకే తన సర్కార్ పనితీరు నచ్చితేనే ఓటు వేయమని అడుగుతున్నారు.ఈ రీతిలో అడిగిన నేతలు ముండెవ్వరూ లేరు.
Discussion about this post