సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటికే పలు కార్యక్రమాలతో సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. మహేశ్ బాబు ఫౌండేషన్ను స్థాపించి ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లకు సాయం అందిస్తున్నారు. పలు గ్రామాలను అభివృద్ధి కోసం కూడా సాయం చేశారు. తాజాగా, మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
తన తండ్రి కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా పేద విద్యార్థులకు చేయూతనిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మహేశ్ బాబు. ‘సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషన్ ఫండ్’ పేరుతో సాయం అందించనున్నారు. 40 మందికిపైగా పేద విద్యార్థులను ఎంపిక చేసి ఈ స్కాలర్ షిప్ అందించనున్నారు. పాఠశాల చదువు నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు స్కాలర్ షిప్ ఇవ్వనున్నారు.
2020లో తన సతీమణి నమ్రతా శిరోద్కర్తో కలిసి మహేశ్ బాబు.. ‘మహేశ్ బాబు ఫౌండేషన్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సుమారు 2500 మందికిపైగా చిన్నారులకు గుండెకు సంబంధించిన ఆపరేషన్లకు సాయం అందించారు. కృష్ణ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని బుర్రిపాలెంలో ఓ పాఠశాలను నిర్మించారు. పలు ఇతర సేవా కార్యక్రమాలను ఆయన కొనసాగిస్తున్నారు.
మహేశ్ బాబు తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోలా మిగితా సినీ నటులు కూడా ఎంతో కొంత సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రావాలని కోరుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కాగా, ‘ఎప్పటికీ సూపర్ స్టార్’ అంటూ కృష్ణ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు మహేశ్ బాబు.
ఇక, మహేశ్ సినిమాల విషయానికొస్తే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2024 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.
Discussion about this post