నిత్యాలంకార భూషితుడైన శ్రీ వేంకటేశ్వరుడు భక్తులకు రమ్య మనోహరంగా దర్శనం ఇస్తుంటాడు. మొదట్లో ఈ విగ్రహానికి ఇన్నిఆభరణాలు అలంకరించే వారు కారు. ఇప్పుడు శ్రీవారికి 20 కిలోలకు పైబడిన కిరీటాలు కూడా పెడుతున్నారు. మొత్తంగా ఈ ఆభరణాల బరువు వంద కిలోల వరకు ఉంటుందని అంచనా.స్వామి వారి విగ్రహం పద్మాకారంలో ఉన్న ఒక రాతి పీఠంపై ఉంటుంది.
శేషాచల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రపంచంలోనే అపర కుబేరుడు. ఆయన సిరి సంపదలు ఎంతో తెలియాలంటే , ఆయన వైభోగం చూస్తే చాలు . ఆయన వద్ద ఉన్న బంగారు నిల్వలు చూస్తే చాలు ఆయన ఎంతటి కుబేరుడో అర్ధం అవుతుంది. ఒక చిన్నపాటి దేశం వద్ద ఉన్నంత బంగారు నిల్వలు స్వామివారి వద్ద ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం భక్తుల రద్దీతో ఉంటుంది. కోరి కొలిచే వారికి కొంగు బంగారమై నిలిచే కోనేటి రాయుడికి కావాల్సినంత బంగారం ఉంది. నిత్యం దేశ విదేశాల నుండి స్వామి వారిని దర్శించుకునే భక్తులు స్వామివారికి బోలెడన్ని కానుకలు సమర్పిస్తారు. బంగారం అయితే లెక్క లేనంత స్వామి వారి ఖజానా కు చేరుతుంది.
ప్రతి సంవత్సరం కోట్ల సంఖ్యలో స్వామిని దర్శించుకునే భక్తులు స్వామి వారికి బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు కానుకగా సమర్పించుకుంటున్నారు. చాలా విలువైన, అపురూపమైన ఆభరణాలు స్వామి వారి సొంతం. బ్యాంకుల్లో ఉన్న బంగారు నిల్వలు 11 టన్నుల మేరకు ఉండొచ్చని సమాచారం.
మొత్తం స్వామివారి వద్ద ఉన్న ఆభరణాలతో కలిపి 11 టన్నుల బంగారం ఉందని అంటారు. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోనే సుమారుగా 6 టన్నుల బంగారం ఉండగా, మరో 2 టన్నుల బంగారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో ఉంది.. తమిళనాడులోని పంజాబ్ నేషనల్ బ్యాంకు 1,381 కేజీల బంగారాన్ని డిపాజిట్ కాలపరిమితి ముగియడంతో స్వామివారికి తిప్పిపంపారు. దేశంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి.
ప్రస్తుతం ఆలయంలోని మూల మూర్తి అలంకరణకు 120 రకాల ఆభరణాలు, ఉత్సవ మూర్తుల అలంకరణకు 383 రకాల ఆభరణాలు వాడుతున్నారు. శ్రీవారికి 6 కిరీటాలు, 2 0 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు మరో 7 కిరీటాలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. స్వామి వారికి వచ్చే విరాళాలు దాదాపు 650 కోట్ల రూపాయల పైగానే ఉంటుంది. కేవలం శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అమ్మడం ద్వారానే ఆలయానికి లక్షల్లో ఆదాయం వస్తుంది.
ఇక వివిధ బ్యాంకులో స్వామి వారికి నగదు డిపాజిట్లు 16000 కోట్ల మేరకు ఉన్నాయి. అలాగే స్వామి వారికి 7123 ఎకరాల భూములు వివిధ ప్రదేశాల్లో ఉన్నాయి. వీటి విలువ కూడా కోట్లలోనే ఉంటుంది. దేశ వ్యాప్తంగా 960 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇందులో కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి.
Discussion about this post