తల్లిగా ఎంతో పోరాడా.. సుప్రీంకోర్టులోనూ నా కూతురికి న్యాయం దక్కలేదు – ప్రత్యూష తల్లి

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఆమె తల్లి సరోజిని దేవి ఎమోషనల్‌గా స్పందించారు. హైకోర్టు విధించిన రెండున్నరేళ్ల జైలుశిక్షను సుప్రీంకోర్టు సమర్థించడంతో పాటు నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలని ఆదేశించినప్పటికీ, తనకు మాత్రం పూర్తి న్యాయం జరగలేదని అన్నారు.

తన కూతురు ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని, ఘటన వెనుక మరిన్ని అనుమానాస్పద అంశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఎన్నో ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నానని, మరింత కఠిన శిక్ష విధిస్తారని ఆశించానని తెలిపారు.

  • దివంగత నటి ప్రత్యూష కేసులో తుది తీర్పు
  • సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్డు ఆదేశాలు
  • సంపూర్ణ న్యాయం జరగలేదంటోన్న ప్రత్యూష తల్లి

నటి ప్రత్యూష మృతి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం ఎట్టకేలకు తుదితీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిద్ధార్థ్ రెడ్డికి హైకోర్టు విధించిన రెండున్నరేళ్ల జైలుశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ, నాలుగు వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఈ కేసులో వివిధ కోర్టులలో విచారణలు సాగిన తరువాత, సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం కీలకంగా మారింది. సెషన్స్ కోర్టు మొదట ఐదేళ్ల శిక్ష విధించగా, అనంతరం హైకోర్టు దాన్ని తగ్గించింది. ఇప్పుడు అదే శిక్షను సుప్రీంకోర్టు సమర్థించడంతో కేసుకు న్యాయపరంగా ముగింపు లభించినట్టైంది.

ఈ తీర్పు అనంతరం ప్రత్యూష తల్లి సరోజిని దేవి మీడియాతో భావోద్వేగంగా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నానని చెబుతూనే తనకు మాత్రం సంపూర్ణ న్యాయం దక్కలేదని అభిప్రాయపడ్డారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఈ ఘటన వెనుక అనుమానాస్పద అంశాలు ఉన్నాయని ఆరోపించారు. తన కూతురి మరణం వెనుక దురుద్దేశం ఉందని మొదటి నుంచీ తాను నమ్ముతున్నానని, కేసు విచారణలో కొన్ని కీలక అంశాలు పట్టించుకోకపోవడం, సాక్ష్యాలు తారుమారు చేయడం వల్ల నిజం పూర్తిగా బయటకు రాలేదని సరోజినిదేవి ఆవేదన వ్యక్తం చేశారు.

తన కూతురి విషయంలో న్యాయం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నానని చెప్పారు. హైకోర్టు విధించిన శిక్షని సుప్రీంకోర్టు మరింత పెంచుతుందని ఆశించగా, హైకోర్టు విధించిన శిక్షనే ఖరారు చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఒక తల్లిగా తన కూతురి మరణాన్ని ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నానని, న్యాయ వ్యవస్థపై గౌరవం ఉన్నప్పటికీ ఈ కేసులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదని ఆమె పేర్కొన్నారు. తనలాంటి సామాన్య కుటుంబాలకు భవిష్యత్తులో అయినా పూర్తిస్థాయి న్యాయం జరిగేలా వ్యవస్థ మరింత పారదర్శకంగా ఉండాలని కోరారు.

1990ల చివర్లో, 2000ల ప్రారంభంలో ప్రత్యూష తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి. పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె కెరీర్ పరంగా పీక్స్‌లో ఉన్న సమయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. 2002 ఫిబ్రవరి 23న ఆమె తన ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డితో కలిసి పురుగుల మందు సేవించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మరణించగా, సిద్ధార్థ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రత్యూష ఆత్మహత్యకు సిద్ధార్ధ్‌రెడ్డే కారణమంటూ ఆమె తల్లి సరోజిని దేవి చేసిన ఫిర్యాదుతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

ప్రత్యూషని అత్యాచారం చేసి చంపేశారని అప్పట్లో వార్తలు రాగా పోస్టుమార్టం చేసిన వైద్యులు దాన్ని ధ్రువీకరించలేదు. ప్రత్యూష మరణవార్తతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ కేసు సెషన్స్ కోర్టు నుంచి హైకోర్టుకు, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు చేరింది. 24 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు తుది తీర్పుతో కేసుకు న్యాయపరంగా ముగింపు వచ్చినా, ప్రత్యూష కుటుంబం మాత్రం సంపూర్ణ న్యాయం జరగలేదన్న భావన వ్యక్తం చేస్తోంది.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top