ఇరాన్ వార్ ఎఫెక్ట్.. భారత్ లోని ప్రధాన నగరాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ కష్టాలను తీసుకొస్తోంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబైలో సరఫరాకు బ్రేకులు పడుతున్నాయి.

రెస్టారెంట్లు, హోటళ్లకు కమర్షియల్ సిలిండర్లను ఆపేస్తున్నాయి ఆయిల్ కంపెనీలు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయకపోతే సంస్థలు మూసేయక తప్పదని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. 70 రోజుల గ్యాస్ సరఫరా ఉందని చెప్పి.. ఇలా ఆకస్మికంగా బంద్ చేయడం ఏంటని నిలదీస్తోన్న బెంగళూరు హోటళ్ల సంఘం నిర్వాహకులు.

ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది చెన్నై హోటల్స్ అసోసియేషన్. ఫుడ్ ఇండస్ట్రీకి గ్యాస్ సరఫరా పునరుద్ధరించాలని ఆ సంఘం డిమాండ్ చేసింది. అలాగే హాస్పిటల్స్, హాస్టల్స్ పై భోజన సరఫరా ప్రభావం పడుతోందని హెచ్చరించింది. ఐటీ పార్కులు, ప్రయాణికులపై కూడా ప్రభావం ఉందని లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా, హోటల్స్, రెస్టారెంట్ల బుకింగ్స్ దెబ్బతినే అవకాశం ఉందని ఈ పరిస్థితిని వెంటనే నివారించాలని చెన్నై హోటల్స్ అసోసియేషన్ కోరింది.

ఇక బెంగళూరు, చెన్నైయే కాదు.. అటు ముంబైలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొందని అక్కడి అసోసియేషన్ అంటోంది. ఇప్పటికే 20శాతం హోటల్స్ మూతపడ్డాయని.. ముంబై హోటల్స్ అసోసియేషన్ కూడా చెబుతోంది. ముంబైలోని రెస్టారెంట్లు తీవ్రమైన వంట గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి, సరఫరాలను త్వరగా పునరుద్ధరించకపోతే అనేక సంస్థలు త్వరలో మూసివేయాల్సి వస్తుందని హోటల్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంక్షోభం త్వరలో ముంబైలోని రెస్టారెంట్ పరిశ్రమను స్తంభింపజేయవచ్చని ఇండియా హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ శెట్టి అన్నారు. ఈ కొరత ఇలాగే కొనసాగితే ముంబైలోని అన్ని రెస్టారెంట్లు రాబోయే రెండు రోజుల్లో మూసివేయాల్సివస్తోందని శెట్టి అన్నారు. అసోసియేషన్ కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాసిందని, మహారాష్ట్ర పౌర సరఫరాల మంత్రి ఛగన్ భుజ్బల్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు.

Follow for more updates
