ఒక అమ్మాయిని మోసం చేసి నగరానికి తీసుకువచ్చారు.. ఆమె చేతిలో ఉద్యోగం లేదు.. తిరిగి వెళ్లడానికి డబ్బు లేదు.. చుట్టూ అపరిచితులు.. తర్వాత ఆమె శరీరాన్నే సరుకుగా మార్చేశారు..!

మరోవైపు.. ఇంకో మహిళ ఉంది.. ఆమె కూడా అదే వృత్తిలో ఉంది.. కానీ ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదు.. ఎవరూ అమ్మలేదు.. ఎవరూ బలవంతం చేయలేదు.. అయితే ఈ ఇద్దరినీ ఒకేలా చూడాలా? ఇద్దరినీ ఒకే చట్టంతో కొలవాలా? ఇదే ప్రశ్న ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు నిలిచింది. ఇంతకీ సుప్రీంకోర్టు ఏం తీర్పునిచ్చింది?
మొదట ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ తీర్పు వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసిన తీర్పు కాదు. అలాగే వ్యభిచారాన్ని ప్రోత్సహించే తీర్పు కూడా కాదు. అసలు ఈ తీర్పు మొత్తం హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితుల రక్షణ గురించి. కానీ అదే సమయంలో ట్రాఫికింగ్కు గురైన వ్యక్తిని, తన ఇష్టప్రకారం వ్యభిచారం చేస్తున్న అడల్ట్ను ఒకేలా చూడకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కథను అర్థం చేసుకోవాలంటే చరిత్రలోకి వెళ్లాలి.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నుంచే మన దేశం మనుషుల అక్రమ రవాణాను తీవ్ర నేరంగా పరిగణించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 స్పష్టంగా ట్రాఫికింగ్ను నిషేధించింది. ఎందుకంటే పేదరికం, మోసం, బలవంతం, బెదిరింపులు లేదా మానవ దోపిడీ ద్వారా లక్షలాది మంది మహిళలు, పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారని దేశం గుర్తించింది. తర్వాత 1956లో ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ అనే చట్టం వచ్చింది.
దీని ప్రధాన లక్ష్యం వ్యభిచారం చేసే వ్యక్తులను శిక్షించడం కాదు. వారి వెనుక పనిచేసే దళారులు, బ్రోతల్ నిర్వాహకులు, ట్రాఫికింగ్ ముఠాలను అడ్డుకోవడం. కానీ కాలక్రమేణా ఒక పెద్ద సమస్య బయటపడింది. ట్రాఫికింగ్కు గురైన మహిళలు, తమ ఇష్టప్రకారం వ్యభిచారం చేస్తున్న మహిళలు, ఇద్దరూ ఒకే వ్యవస్థలో చిక్కుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్లు జరిగినప్పుడు అందరినీ ఒకేలా పట్టుకుని ఆశ్రయ కేంద్రాలకు పంపించడం, వారి అభిప్రాయం అడగకుండా పునరావాసం పేరుతో నిర్బంధించడం వంటి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఒక ప్రాథమిక ప్రశ్న తలెత్తింది.
Follow for more updates
