కాకతీయుల పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది అద్బుతమైన శిల్ప కళా సంపద… కాకతీయులు శివుణ్ణి ఆరాధించేవారు… అలాంటి శివారాధకులు ఒకటి కాదు… రెండు కాదు… 365 ఆలయాలు నిర్మించారు… అందులో ఒకటి… హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలోని పెద్ద కోడెపాక గ్రామంలో ఉన్న రాజ రాజేశ్వర స్వామి దేవాలయం… దేశంలో కాశీ పుణ్య క్షేత్రం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన పెద్ద కోడెపాక గ్రామంలోని శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం పాలకుల ఆదరణకు నోచుకోవడం లేదు. ప్రాముఖ్యత కలిగిన ప్రాచుర్యానికి నోచుకోని కాకతీయుల కాలం నాటి పెద్ద కోడెపాక గ్రామం రాజ రాజేశ్వర స్వామి దేవాలయంపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం…
ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయులది గొప్ప చరిత్ర. తెలంగాణ నలుదిశలతో పాటు… తెలంగాణ ప్రాంతాన్ని దాటి ఆంధ్రలోనూ కాకతీయుల పాలన కొనసాగింది. ఇప్పటి వరంగల్ నగరానికి వెళితే మనకు ఠక్కున గుర్తొచ్చేది వేయి స్థంబాల గుడి. ఉమ్మడి వరంగల్ పేరు చెబితే చాలు రామప్పగుడి… పాకాల చెరువు… చెప్పుకుంటూ పోతే కాకతీయుల పాలనకు సాక్ష్యంగా నిలిచేవి అనేకం నేటికీ దర్శనమిస్తాయి. వ్యవసాయానికి ఊతం ఇచ్చేందుకు నాడు కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు వారి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. మనిషిని ముందుకు నడిపించేది నమ్మకం… ఆ నమ్మకానికి పునాది వేసేది ఆద్యాత్మికత… ఆ ఆద్యాత్మికతకు పెద్దపీట వేసిన కాకతీయుల స్వయంగా శివారాధకులు. అందుకే మనకు కాకతీయ పాలనలో ఎక్కువగా శివాలయాలు కనిపిస్తాయి.
కాకతీయుల పాలనలో కనిపించే శివాలయాల్లో నేటి హనుమకొండ జిల్లా భూపాలపెల్లి నియోజకవర్గం పరిధిలోని పెద్ద కోడెపాక గ్రామంలో ఉన్న శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రాముఖ్యత కలిగింది. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో భక్తుల కోరికలు తీర్చే అమ్మవారు వారాహి రూపంలో దర్శనం ఇస్తారు. బ్రాహ్మిణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చాముండి, నరసింహీ, వినాయకీ గా పిలువబడే సప్త మాత్రికల్లో వారాహిదేవి అమ్మవారిని ఒకరుగా చెబుతారు. ఈ సప్త మాత్రికలు… విష్ణుమూర్తి అవతారాల నుంచి ఉద్భవించిన వారుగా పురాణాలు చెబుతున్నాయి. వీటిల్లో వారాహి అవతారం ప్రత్యేకమైనది.
ఇక శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం విషయానికొస్తే… ఇదిగో మీరిప్పుడు చూస్తున్నదే పెద్ద కోడెపాక గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన శ్రీరాజ రాజేశ్వర స్వామి దేవాలయం. బయటి నుంచి చూస్తే పెద్దగా ఏమి కనిపించదు. కానీ గుడి లోపలికి వెళితే ఆలయ నిర్మాణం… నాటి శిల్ప కళా నైపుణ్యం కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. సుమారు వెయ్యేళ్ల కిందట దేవతా మూర్తుల విగ్రహాలను సుందరంగా చెక్కారంటే… నాడు శిల్ప కళా వైభవం ఎంత గొప్పగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఈ గుడికి వచ్చిన వారికి కోరిన కోరికలు తీరుతాయన్న నమ్మకం భక్తుల్లో ఉంది. అందులో సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
ఆలయ ప్రాంగణంలో నాడు నిర్మించిన కొలను లాంటి భావి నిర్మాణం కూడా ఉంది. అందులో ఇప్పటికీ నీళ్లున్నాయి. అయితే ఆదరణకు నోచుకోని కారణంగా అది చెత్తా చెదారంతో నిండిపోయింది. వెయ్యేళ్ల కిందటే… రాళ్లతో నిర్మితమైన ఈ కొలను లాంటి బావి చరిత్రకు మరో సాక్ష్యంగా నిలుస్తోంది. నాటి పాలనకు దర్పనం పడుతుంది. ప్రభుత్వ పరంగా ఆదరణ లేని ఈ ఆలయంలో ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. కారు చీకట్లు కలిగిన అమావాస్యను పారద్రోలేలా దీపాలను వెలిగిస్తారు. అవి శివునికి స్వాగతం పలుకుతున్నట్లుగా కనిపిస్తాయి. ఆ విద్యుత్ దీపాల కాంతిలో భక్తులు పరమశివున్ని గుర్తు చేసుకుంటూ పరవశించి పోతారు. భక్తులు గుడి వద్ద ఏర్పాటు చేసే అగ్ని గుండం దాటుతూ సంతోషంగా నడుస్తారు.
సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్న కాశీ పట్టణానికి క్షేత్ర పాలికగా వారాహి దేవిని కొలుస్తారట. చాలా చోట్ల శివుడే క్షేత్ర పాలకుడిగా ఉంటాడు. కానీ ఆ పరమశివునికి ఈ వారాహిదేవి క్షేత్ర పాలికగా ఉంది. కాశీ పట్టణం… ఆ తర్వాత ఇక్కడి పెద్ద కోడెపాక గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి క్షేత్రపాలికగా తంజాపూర్ బృహదీశ్వరాలయానికి ఈ మాత క్షేత్రపాలికగా కాపలా కాస్తుందట. తంజావూర్ భువదీశ్వరాలయంలో ఈ అమ్మవారికి ఓ ప్రత్యేక ఆలయమే ఉంది. ఇంతటి పేరు ప్రఖ్యాతలు కలిగిన అమ్మవారి ఆలయం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండటం నిజంగా చాలా విశేషం.
అంతటి పేరు ప్రఖ్యాతలు గాంచిన కాకతీయ శిల్పగల సంపద ఇప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. రాజకీయ నాయకులు తమ లబ్దికోసం ఇక్కడికి వచ్చి పూజలు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది. కానీ హామీలన్నీ నీటిమీద తారలుగా మారుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయిన తర్వాత కాకతీయుల కాలం నాటి శిల్ప కళా సంపదకు, నాటి దేవాలయాలకు గుర్తింపు లభిస్తుందని ఆశించిన ప్రజలకు భంగమే ఎదురవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత స్పీకర్ గా చేసిన మధుసూధనాచారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వారే. ఆయన ఇచ్చిన హామీలు కూడా కార్యరూపం దాల్చలేదు.
ఆలయానికి మూడు తరాలుగా ఒక పూజారి కుటుంబం వంశ పారంపర్యంగా అర్చకునిగా సేవలు అందిస్తుంది. అయితే ప్రస్తుతం పూజారిగా కొనసాగుతున్న అర్చకుడు పండుగల సమయంలో ప్రముఖులను ఆలయానికి ఆహ్వానిస్తూ, గుడి ప్రాముఖ్యత తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పరంగా ఆశించిన స్థాయిలో గుడికి గుర్తింపు లభించడం లేదు. ఆలయాన్ని అభివృద్ది చేయడం ద్వారా కాకతీయుల చరిత్రను గుర్తించిన వారవుతారు. కోరిక కోరికలు తీర్చే పరమ శివున్ని దర్శించుకునేందుకు మరింత మంది భక్తులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
Discussion about this post