ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ సిరీయస్ అయ్యింది. కౌంటింగ్ తర్వాత జరిగే పరిణామాలపై ఫోకస్ పెంచింది. కౌంటింగ్ రోజుతో పాటు మిగతా 15 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. రాష్ట్రానికి అదనంగా మరో 25 కంపెనీల కేంద్ర బలగాలను నియమించింది. ఇప్పటికే 20 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకోగా…. రెండురోజుల్లో మరో 5 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. ఎలక్షన్ కౌంటింగ్లో హింసాత్మక ఘటనలు జరగకుండా అన్ని జిల్లాలకు స్పెషల్ పోలీసు ఆఫీసర్లను నియమించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన పల్నాడులో అత్యధికంగా 8 మంది పోలీస్ అధికారులను నియమించారు. కృష్ణా జిల్లాకు చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా పని చేస్తున్న లావణ్య లక్ష్మిని.. విజయవాడ పోలీస్ కమిషనరేట్కు సిఐడి డీఎస్పీ సోమన్నను నియమించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలోని రెల్లి వీధిలో సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలును, అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల నివాసాల్లో తనిఖీలు చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాకు ముగ్గురు సెష్పల్ అధికారులను నియమించి…వారికి సమస్యాత్మక ప్రాంతాల బాధ్యతలు అప్పగించనున్నారు. మరోవైపు జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని… పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణను క్షేత్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్కుమార్ మీనా పరిశీలించారు. ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలో విస్తృతంగా పర్యటించారు. జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్ తో కలిసి ఏయూ పరిధిలోని స్ట్రాంగ్ రూమ్ల భద్రతను స్వయంగా పరిశీలించారు. విశాఖపట్టణం పార్లమెంటుతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసి…అక్కడ పరిస్థితులను గమనించారు. తలుపులకు వేసిన తాళాలను, వాటికున్న సీళ్లను సున్నితంగా పరిశీలించారు. స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయా? అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారా? అంటూ సంబందిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కౌంటింగ్ కేంద్రా వద్ద మూడెంచల భద్రతను పాటించాలని, అక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఎన్నికల ప్రధానాధికారి సూచించారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్లు ఉన్న ప్రాంతాల్లోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరాదని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం తగిన జాగ్రత్తలు పాటించాలనన్నారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చెయ్యాలని జిల్లా అధికారులకు సూచించారు.
కౌంటింగ్ రోజు కోసం ఎలెక్షన్ కమిషన్ భారీ ఏర్పాట్లను చేస్తోంది. రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బలగాల నిఘా నీఢలో కౌంటింగ్ జరిగేలా ప్లాన్ చేస్తోంది. కౌంటింగ్ తర్వాత విజయోత్సవాలు, ఊరేగింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ తీసుకుంటుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈసీ చర్యలు చేపడుతోంది.
Discussion about this post