ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని పావులు కదుపుతున్నారు. సరికొత్త అస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు. విపక్షాలు జగన్ ఓటమే లక్ష్యంగా పొత్తులతో ఏకం అవుతున్న వేళ..జగన్ రైతు రుణమాఫీ అస్త్రం తో బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు సంక్రాంతి వేళ కీలక ప్రకటన చేసేందుకు సిద్దం అవుతున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చినా తాను సింగిల్ గానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో తాను అమలు చేసిన సంక్షేమమే తనను గెలిపిస్తుందని విశ్వసిస్తున్నారు.
మొన్న కర్నాటక… నిన్న తెలంగాణా ఎన్నికల్లో కూడా …కాంగ్రెస్ నేతలు రైతుల కోసం వరాలు ప్రకటించారు. అధికారం చేపట్టారు. ఇపుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా రైతు రుణ మాఫీ అన్న బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయబోతున్నారని తెలుస్తోంది. నిజానికి ఇది చాలా ఖరీదైన హామీ.. రైతులు ప్రతీ ఏటా కనీసం రెండు పంటలు పండిస్తారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల కానీ గిట్టుబాటు ధర దక్కకపోవడం వల్ల కానీ వారికి నష్టాలే మిగులుతున్నాయి. తీసుకున్న రుణాలను వారు కట్టలేని పరిస్థితి ఎదురవుతోంది. ఈ క్రమంలో కొత్తగా సాగు చేయడానికి పెట్టుబడి పుట్టే పరిస్థితి లేకుండా పోతుంది.. . వడ్డీల మీద వడ్డీలు చక్రవడ్డీలు పెరిగి రైతులకు పెనుభారంగా మారుతుంది. ఈ రుణభారం భరించలేకనే పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రుణ మాఫీ చేస్తే అది రైతుకు ప్రాణ దానం చేసినట్లవుతుంది. రాజకీయ పార్టీలు ఇంత పెద్ద హామీని ఇవ్వడానికి వెనుకాడతాయి. ఇచ్చినా పూర్తి స్థాయిలో అమలు చేయలేవు. ఇప్పటికి పదేళ్ల క్రితం అంటే 2014లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీగా రుణ మాఫీని తెరపైకి తెచ్చింది. ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చింది. ఆనాటికి రైతు రుణ మాఫీ మొత్తం లక్ష కోట్ల రూపాయలుగా ఉంది.
Discussion about this post