తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈనెల 7న సీఎంగా రేవంత్, మంత్రులుగా మరో 11 మంది ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. శాఖలు కేటాయించకుండానే.. డిసెంబర్ 8న తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్.. అధిష్టానంతో చర్చించాక మంత్రులకు శాఖలు కేటాయించారు. కీలకమైన హౌంశాఖను ఎవరికీ కేటాయించక పోవడం విశేషం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హోం, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను నిర్వహిస్తారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఆర్థిక, విద్యుత్ శాఖలు.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖలు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ.. దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖలను కేటాయించారు.
మంత్రి కొండా సురేఖకు అటవీ పర్యావరణం, దేవాదాయ శాఖలు, సీతక్కకు పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖలు, తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయం, చేనేత శాఖలు, జూపల్లి కృష్ణ రావుకు ఎక్సైజ్, టూరిజం, పొన్నం ప్రభాకర్ కు రవాణా, బీసీ సంక్షేమ శాఖలు, దామోదర రాజనర్సింహకు వైద్యారోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు.
ఐటీ శాఖను ఎవరికి కేటాయిస్తారనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎల్లారెడ్డి పేట ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్లు తెరపైకి రాగా.. చివరికి శ్రీధర్ బాబుకు ఐటీ మంత్రిగా అవకాశం దక్కింది. హోం శాఖను సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలలో ఒకరికి కేటాయిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ ఆ శాఖను సీఎం రేవంత్ వద్దే ఉంచుకున్నారు.
Discussion about this post