దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీకి 40 మంది సభ్యులున్నారు. ప్రతిపక్ష బీజేపీకి 25 మంది ఉన్నారు. మరో ముగ్గురు స్వతంత్ర సభ్యులు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సంఘ్వి గెలవాల్సి ఉంది .బీజేపీకి బలం లేకపోయినా తమ పార్టీ తరఫున హర్ష్ మహాజన్ ను బరిలో దింపింది.
ఈ నేపథ్యంలో ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేశారు. అలాగే ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా హర్ష్ మహాజన్ కే ఓటేశారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సింఘ్వికి 34 ఓట్లు, బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ కు 34 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో విజేతను నిర్ణయించడానికి లాటరీ తీయగా హర్ష్ మహాజన్ ను విజయం వరించింది. అదే సమయంలో గత ఎన్నికల్లో 40 స్థానాలను సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆరుగురు బయటకు పోవడంతో 34 స్థానాలకు పరిమితమైంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ చెరో 34 స్థానాలతో నిలబడ్డాయి.
దీంతో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని.. మెజారిటీని నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించాలని గవర్నర్ ను కలవడానికి బీజేపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదిపింది. రాజ్యసభ ఎన్నికల్లో విప్ ను ధిక్కరించి బీజేపీకి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో వారిపై స్పీకర్ ద్వారా వేటు వేయించింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ ఈ నిర్ణయం తీసుకుని ఆరుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. బీజేపీకి చెందిన 15 ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేయడంతో మూజువాణి ఓటుతో బడ్జెట్ శాసనసభ ఆమోదం పొందింది. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకున్నట్లైంది.
Discussion about this post