గచ్చిబౌలిలో సభనిర్వహించాలనుకున్న పవన్ కు గెట్టి షాక్ తగిలింది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి.

కాసేపట్లో హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కోర్టులో వాదనలకు ముందే తన ప్రెస్ మీట్ పై పవన్ ట్వీట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సాయంత్రం ప్రెస్ మీట్ పెడతానన్నారు పవన్. జూబ్లీహిల్స్ నివాసంలో సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య పవన్ మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. మరి దీనికైనా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలని.. దీనికైనా పర్మిషన్ ఇస్తారో లేదో చూద్దాం అంటూ పవన్ సెటైర్లు పేల్చారు. ఈ ప్రెస్మీట్ జనసేన నేతలతో కలిసి ఉంటుందని సమాచారం.
మరోపక్కతెలంగాణ ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరిలూదుకొన్నది తెలంగాణ గడ్డపైనేనని పేర్కొన్నారు. ఈ నేల నుంచే వారసత్వంగా పోరాట పటిమను పుణికి పుచ్చుకున్నదని చెప్పారు. తెలంగాణ సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ‘‘అణగారిన వర్గాల సంక్షేమం, యువత ఆకాంక్షలు, వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగితే గళం వినిపించే తెగువ తెలంగాణలో ఉంది. ఆ లక్షణం జనసేన శ్రేణుల్లోనూ నిండుగా ఉందని పవన్ పేర్కొన్నారు. ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద విలసిల్లే తెలంగాణ రాష్ట్రం సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికీ అంజలి ఘటిస్తున్నాను.
రాయదుర్గంలోని సంధ్య కన్వెన్షన్ వేదికగా ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం’ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు, శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించినట్లు వెల్లడించారు. దీనిపై శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తల్లూరి రామ్ జూన్ 2న సంధ్య కన్వెన్షన్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారు 2 వేల మంది కార్యకర్తలతో నిర్వహించాలనుకున్న జనసేన సాధకుల సమావేశానికి అనుమతి కోరినట్లు చెప్పారు. ‘‘సమావేశం అనుమతి విషయంపై దర్యాప్తు చేసినట్లు చెప్పారు. ఏపీలో ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ వ్యాఖ్యలపై నమోదైన కేసులు, వాటి కారణంగా తెలంగాణలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు, అలాగే కొందరు ఏపీ రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని దర్యాప్తులో తేలింది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, వ్యతిరేక ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సమయంలో ఈ సమావేశం వల్ల భారీ స్థాయిలో నిరసనలు, ప్రదర్శనలు, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడొచ్చు. ఈ పరిస్థితుల్లో సమావేశం నిర్వహిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది. మరోవైపు, సమావేశానికి వచ్చే సుమారు 2 వేల మంది కోసం సరిపడా పార్కింగ్ సదుపాయం లేదని వేదిక యాజమాన్యం ధ్రువీకరించింది. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జనసేన సమావేశానికి అనుమతి నిరాకరించాం’’అని డీసీపీ తెలిపారు.
Follow for more updates
