ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు… నమ్మితే మోసపోతారు… అనేది చాలా మంది ముందు జాగ్రత్త కోసం చెప్పే మాట. ఎవరినో నమ్మకపోతే సరే… ప్రభుత్వాన్ని నమ్మకపోతే ఎలా…? అనుకున్నారు అక్కడి ప్రజలు. చివరకు పెద్దలు చెప్పే మాటే నిజమైంది.
హన్మకొండలో దశాబ్దాలుగా స్థిర నివాసం ఉంటున్న ప్రజలకు కొత్తగా ఇండ్లు నిర్మిస్తామని ఆశ చూపించి స్థలం ఖాళీ చేయించి… తీరా ఇప్పుడు స్థలం ఖాళీ చేసిన వారిని మీరే అర్హులనడానికి ఆధారమేమిటి అని ప్రశ్నిస్తున్న అధికారుల వైఖరిపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం…
ఒక్కసారి ఇక్కడి ప్రజల దుస్థితి చూడండి… వారంతా బంగారు తెలంగాణలోనే ఉన్నారా? అనే అనుమానం వస్తుంది కదూ. వానకు తానుతూ… ఎండకు ఎండుతూ… చలికి వణుకుతూ… అన్నట్లు జీవనం వెళ్లదీస్తున్నారు వీరంతా. తాత్కాలికంగా గుడిసెలు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ఇంట్లో నుంచి బయట కాలు పెట్టాలన్నా… బయటి నుంచి ఇంట్లోకి రావాలన్నా మురుగునీరు దాటుతూ వెళ్లాల్సిందే. ఇంతటి బాధ వీరికెందుకు? ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ పథకం కింద ఇండ్లు ఇస్తుంది కదా…? మరి వీరి వరకు ఆ పథకం రాలేదా…? అనే అనుమానం వస్తుంది కదూ. ఈ విషయం తెలియాలంటే మనం ఈ సీన్ కట్ చేసి మరో సీన్ లోకి ఎంటర్ కావాల్సిందే.
పేదల కోసమని ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించిందో…? వందల సంఖ్యలో ఇండ్లు నిర్మించారు. మూడు అంతస్థుల్లో నిర్మాణాలు చేపట్టారు. ఇండ్ల నిర్మాణ పనులు ఏనాడో పూర్తయ్యాయి. ప్రస్తుతం ఒక నివాస ప్రాంతంగా కనిపిస్తుంది ఆ ప్రాంతం. కానీ ఎవరూ నివాసం ఉండటం లేదు. అక్కడ నిర్మించిన ఇండ్లన్నీ ప్రజలకు కేటాయిస్తే ఒక పెద్ద జనావాసమే ఏర్పాటవుతుంది. ఎవరికీ కేటాయించక పోవడం కారణంగా ఇప్పుడవి ఖాళీగానే ఉంటున్నాయి. కొత్తగా నిర్మాణం పూర్తయన ఈ ఇండ్లు చూసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది? మొదటి సీన్ లో మనం చూసిన ప్రజలు ఇండ్లు లేకుండా ఉన్నారుగా వారికి… వీరికి ఈ ఇండ్లును కేటాయిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అయితే వారికి… ఈ ఇండ్లు ఎందుకిస్తారు? అనే సందేహం కూడా వస్తుంది. ఇప్పుడీ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే… మనం కాల గమనంలో కాస్త వెనక్కి వెళ్లాలి.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ బస్టాండ్ పరిసర ప్రాంతం, న్యూ శాయంపేట వద్ద డబుల్ బెడ్ రూమ్ పథకం కింద ఇండ్లు నిర్మించాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించారు. ఈ మేరకు 2018లో నాటి తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకానికి శంఖుస్థాపన చేశారు. రెండు చోట్ల కలిపి మొత్తం 13వందల వరకు ఇండ్లు నిర్మించాలని నాటి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా న్యూ శాయంపేట వద్ద 32 కోట్ల 22లక్షల రూపాయల వ్యయంతో 608 ఇండ్ల నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. 2018లో మొదలైన పనులు రెండేళ్ల క్రితం పూర్తయ్యాయి. నిర్మాణం పూర్తయిన వాటిని రెండేళ్లుగా అర్హులకు కేటాయించడం లేదు.
అయితే ఈ తాత్కాలిక నిర్మాణాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు… నిర్మాణం పూర్తయిన ఇండ్లకు విడదీయరాని సంబంధం ఉంది. డబుల్ బెడ్ రూమ్ పథకం కింద ఇండ్ల నిర్మాణం చేపట్టక ముందు వారంతా అక్కడే నివశించేవారు. వారికి శాశ్వతంగా ఇండ్లు నిర్మిస్తామనే హామీతో వారంతా అప్పటికే నివాసం ఉంటున్న పాత ఇండ్లు ఖాళీ చేయించారు. వారి నివాసాలను తొలగించి… అదే స్థలంలో కొత్తగా డబుల్ బెడ్ రూమ్ పథకం కింద కొత్త ఇండ్లు నిర్మించాలని నిర్ణయించారు. దశాబ్దాలుగా అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు పక్కా గృహాలు వస్తాయన్న ఆశతో ఉన్న వాటిని ఖాళీ చేసి పక్కనే తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ… ప్రభుత్వం వీరికి ముందుగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు. ఎవరికీ ఇండ్లను కేటాయించడం లేదు. దీంతో నిర్మాణం పూర్తయిన ఇండ్లు ఖాళీగా ఉంటున్నాయి. స్థలాన్ని ఖాళీ చేసిన ప్రజలు ఇబ్బందుల్లో జీవనం సాగిస్తున్నారు.
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని భావించిన ఇక్కడి ప్రజలు… తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడంతో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. అయితే ఆయన నుంచి కూడా తమకు స్పష్టమైన హామీ లభించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థలం ఖాళీ చేసే దాకా ఇండ్లు ఇస్తామని చెప్పి ఖాళీ చేసిన తర్వాత తమను అర్హులు కాదనడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి ఒకప్పటి నుంచి ఇక్కడే నివశిస్తున్న తమందిరికీ ఇండ్లు కేటాయించాలని వారు కోరుతున్నారు.
చూడాలి మరి… శాయంపేట ప్రాంతంలో నిర్మించిన ఇండ్లను ప్రభుత్వం పేద ప్రజలకు పంచుతుందో… లేక గత ప్రభుత్వం తరహాలోనే కాలయాపన చేస్తుందో?
Discussion about this post