ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతల చేతల వెనుక మర్మం అర్ధం చేసుకోవడం చాలా కష్టం. వివిధ శాఖల ఉద్యోగుల విషయంలో సీఎంఓ నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల వరకు అందరూ “విభజించి పాలించు“ విధానాలనే అవలంబిస్తున్నట్టు స్పష్టమవుతోంది. తమ విషయంలోనూ ఇదే జరిగిందని ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు గగ్గోలు పెడుతున్నారు. అయిన వారికి కంచాలు .. కాని వారికి విస్తరాకులన్న చందాన ఏపీవోలకు మాత్రమే పాలకుల అనుగ్రహం లభించిందని.. తమ డిమాండ్ల గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పోరుబాట పడుతున్నామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు తమ కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎఫ్.టి.ఈలు వాపోతున్నారు.
కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు హెచ్ఆర్ పాలసీ వర్తింపజేసినప్పటికీ గ్రేడ్ ఫిక్సేషన్ విషయంలో అన్యాయం జరిగింది. వీరికి అటెండర్.. డ్రైవర్ క్యాడర్ ఇవ్వటం వీరి పట్ల ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపు స్పష్టమవుతోంది. వీరికి నిర్ణయించిన బేసిక్ వేతనం చాలా తక్కువ. అలవెన్సులు ఇస్తూ వీరిని మభ్యపెడుతున్నారు. మరోవైపు వీటిలోనూ కోతలు పెడుతున్నారు. గతంలో పెర్ఫార్మన్స్ అలవెన్స్ కింద నెలకు 1700 రూపాయలు ఇచ్చేవారు. మూడేళ్ల క్రితం ఈ అలవెన్స్ ను రద్దు చేశారు.
ఉపాధి హామీ పథకం అమలులో ఫీల్డ్ అసిస్టెంట్లు, FIXED టెన్యూర్ ఎంప్లాయిస్ అంటే ఎఫ్.టీ.ఈ లు కీలక పాత్ర పోషిస్తున్నారు. వేతనదారులకు పని కల్పించడం, మస్తర్లు నమోదు చేయడం వంటి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 10 వేలమంది ఫీల్డ్ అసిస్టెంట్లు, నాలుగు వేల మంది ఎఫ్.టీ.ఈలు పని చేస్తున్నారు. తమకు ఇస్తున్న వేతనం చాలా తక్కువని వీరంతా వాపోతున్నారు. తమకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.
మరోవైపు ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఏపీవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మండలాల్లో ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్నవారిపై వీరి పెత్తనమే సాగుతోంది. చాలా మండలాల్లో ఎంపీడీవోలను సైతం కాదని వీరు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఆర్ పాలసీలో వీరికి ఈఓ పీఆర్దీ హోదా ఇవ్వడం వెనుక ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న “పెద్దాయన” కరుణే కారణమని చెబుతున్నారు. ఈ కరుణ కోసం ఏపీవోలు పెద్ద మొత్తంలో ముడుపులు సమర్పించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
Discussion about this post