గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తుల్లో సముద్ర తీరాల్లోని నివాసాలపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా సముద్ర మట్టాల పెరుగుదలతో థాయ్లాండ్ రాజధానిని వేరే చోటుకు తరలించాలనే విషయాన్ని పరిశీలించాలని అక్కడి పర్యావరణ శాఖ అధికారులు కోరారు. లేదంటే ఈ శతాబ్దం చివరినాటికి బ్యాంకాక్ లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. మరిన్ని వివరాలు మీకోసం ..
నిత్యం రద్దీగా ఉండే ఈ నగరం వర్షకాలంలో వరద సమస్యతో పోరాడుతోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఇప్పటికే 1.5 డిగ్రీల సెల్సియస్ దాటి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ‘‘ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ దాటిన పరిస్థితుల్లో ఉంటే.. బ్యాంకాక్ను ఇప్పటికే సముద్ర నీరు తాకుతుందని భావించవచ్చు. ఈ ప్రమాదం నుంచి నగరాన్ని కాపాడాలంటే తక్షణమే తరలించాల్సిన అవసర ఉంది. ఇది ఎంతో క్లిష్టమైంది. కానీ, సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మెరుగైన చర్యలను అన్వేషిస్తోంది’’ అని పర్యావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పావిచ్ కేశవవాంగ్ తెలిపారు.
అత్యధిక వేడి, కరవుతో పాటు కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావాలను థాయ్లాండ్ ఎదుర్కొంటోంది. దీనికారణంగా నేషనల్ పార్క్లను మూసివేయాల్సి వచ్చింది. కాలుష్యానికి ముఖ్య కారణమైన పంట వ్యర్థాల దహనానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాజధానిని పూర్తిగా మార్చడానికి ముందుగా అక్కడున్న ముఖ్యమైన వ్యాపారాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశ ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. సముద్ర మట్టాలు పెరగడం ద్వారా ఈ శతాబ్దం చివరినాటికి థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ మునిగిపోయే ప్రమాదం ఉందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Discussion about this post