హైదరాబాద్-బెంగళూరు మధ్య కొత్త హైస్పీడ్ హైవే అందుబాటులోకి రానుంది.
తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ కొత్త జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రస్తుతం నాలుగు వరుసల హైవే అమల్లో ఉంది.
పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా హైదరాబాద్ – బెంగళూరు మధ్య అదనంగా నూతన రహదారిని నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ‘మాస్టర్ ప్లాన్ ఫర్ నేషనల్ హైవేస్ విజన్-2047’లో ఈ రహదారిని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. నాగ్పుర్ – హైదరాబాద్ – బెంగళూరు నగరాల మధ్య రాకపోకలను మరింతగా పెంచాలని రెండేళ్ల కిందట నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం… ప్రయాణ సమయాన్ని మరింతగా తగ్గించేలా కూడా రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.
నాగ్పుర్ నుంచి బెంగళూరు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు కూడా రహదారిని అనుసంధానించాలని తాజాగా నిర్ణయించింది. ఇందుకోసం డీపీఆర్ రూపొందించేందుకు కసరత్తు చేపట్టింది. డీపీఆర్ తయారీకి కాంట్రాక్టర్ ను ఎంపిక చేసేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ టెండర్లు ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు ఈ ఏడాది సెప్టెంబరు 12వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది.
రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని నూతన మార్గాన్ని ఆరు వరుసల్లో నిర్మించాలన్నది కేంద్ర ప్రభుత్వ కొత్త ప్రతిపాదన. అయితే ఈ మార్గంలో తొలుత 12 వరుసల రహదారి నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ ప్రస్తుతం దీన్ని ఆరు వరుసలకే పరిమితం చేశారు. ఈ ఆరు వరుసల రహదిరి నిర్మాణంలో భాగంగా ఒకేసారి ఆరు వరుసలుగా నిర్మిస్తారా? లేక తొలుత నాలుగు వరుసలు నిర్మించి… ఆ తర్వాత మరో రెండు వరుసలను విస్తరిస్తారా? అన్న విషయంలో ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఈ విషయంలో డీపీఆర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది.
హైదరాబాద్ – బెంగళూరు నూతన మార్గాన్ని హైస్పీడ్, గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిగా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 120 కి.మీ.ల వేగంతో వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ రహదారికి ప్రతిపాదనలు సిద్దం చేశారు. తాత్కాలిక అంచనాల ప్రకారం 508 కి.మీ. మేర కారిడార్ రూపొందిస్తారు. 44వ నంబరు జాతీయ రహదారిగా హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య 556 కి.మీ. నాలుగు వరుసల మార్గం ప్రస్తుతం అందుబాటులో ఉంది. తెలంగాణలో 190కి.మీ, ఆంధ్రప్రదేశ్లో 260కి.మీ, కర్ణాటకలో 106 కి.మీ.ల మేర ఈ జాతీయ రహదారి విస్తరించి ఉంది.
ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ పెరిగినందున ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలకు విస్తరించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అందుకోసం 2022లోనే డీపీఆర్ను సిద్ధం చేసింది. అయితే వివిధ కారణాలతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం హైస్పీడ్ కారిడార్ను నిర్మించాలని కేంద్రం నిర్ణయించడంతో ఇప్పుడున్న జాతీయ రహదారి తీరు తెన్నులను అధ్యయనం చేయించారు. హైస్పీడ్కు తగిన రీతిలో ఆ రహదారిని విస్తరించడం సాధ్యం తేలడంతో హైస్పీడ్, గ్రీన్ఫీల్డ్ కారిడార్ను నిర్మించాలని నిర్ణయించిని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు మాస్టర్ప్లాన్లో ప్రతిపాదించింది.
దీంతో హైదరాబాద్ – బెంగుళూరు మార్గంలో వాహనాల వేగం మరింత పెరుగనుంది.
Discussion about this post