రయ్.. రయ్ మంటూ వందలాది ఇసుక లారీలు, ట్రాక్టర్లు దూసుకొస్తాయి. ఫుల్ లోడ్ తో ఎక్కడా ఆగకుండా వెళ్లిపోతాయి. మధ్యలో అధికారులు ఆపడం.. చెక్ చేయడం వంటివేమీ ఉండవు. అలాగని ఇసుక వాహనాలకు పర్మిట్లు కూడా ఉండవు. ఉండేదల్లా లారీ ముందు అద్దంపై ‘సర్దార్’ అనే పదం.. దాని పక్కనే సీఎం రేవంత్ రెడ్డి ఫొటో. ఈ రెండే ఈ లారీలకు పర్మిట్లూ.. లైసెన్సులూ. ఎవరైనా అధికారి ఎప్పుడైనా వాటిని ఆపినా.. చెక్ చేసినా.. ఇక అంతే సంగతులు! పైనుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి.. లారీలు యధావిధిగా.. స్వేచ్ఛగా దూసుకుపోతాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్న ‘సర్దార్’ ఇసుక దందాపై ఫోర్ సైడ్స్ టీవీ గ్రౌండ్
ఖమ్మం జిల్లాలో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి రెండునెలలు కావస్తున్నప్పటికీ ఇసుక తవ్వకాలు, రవాణాపై నిర్ధిష్ట విధానాన్ని రూపొందించకపోవడంతో ఇసుక దందా జోరుగా సాగుతోంది. అనేక క్వారీల్లో ఇసుక తవ్వకాలు నిలిచిపోవడంతో భవన నిర్మాణదారులు, కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ఇసుకను ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లాలో ఇసుక దందా మూడు ట్రాక్టర్లు.. ఆరు లారీలు అన్న చందంగా వర్ధిల్లుతోంది.
తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడి గనులు దోపిడీకి గురికాకుండా గత ప్రభుత్వం నూతన మైనింగ్ విధానాన్ని అమలుచేసింది. ఇటీవల కాంగ్రెస్ అధికారం చేపట్టాక అనేక ఇసుక క్వారీల్లో తవ్వకాలను నిలిపివేసింది. ఖమ్మం జిల్లాలో ఇసుకకు ప్రధాన వనరుగా ఉన్న మున్నేరు, కట్టేలేరు, వైరా నదిలో నిబంధనల ప్రకారం తవ్వకాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక క్వారీల నిర్వహణను నిలిపివేయడంతో ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడింది.
దీంతో ఇసుకాసురులు జిల్లాలో అందుబాటులో ఉన్న ఇసుక క్వారీల్లో అక్రమ రవాణాకు తెరలేపారు. అధికార పార్టీ నేతలు, అధికారుల అండతో మూడు ట్రాక్టర్లు.. ఆరు లారీల చందంగా వ్యాపారం సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లా సరిహద్దుగా ఉన్న మధిర నియోజకవర్గం ప్రాంతాల గుండా ఖమ్మం నగరానికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.
Discussion about this post