అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంటర్మీడియేట్ సెకండియర్ విద్యార్థిని అంకిత మరణించడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే అంకిత మరణించిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. బాధితుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి తలుపుల అద్దాలు పగిలాయి. పోలీసులు వచ్చి నచ్చచెప్పటానికి ప్రయత్నించినప్పటికీ బాధితులు వినిపించుకోలేదు. ఆసుపత్రిని సీజ్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అనంతపురం నగరంలోని స్టాలిన్ నగర్ కు చెందిన నాగేశ్వరమ్మ, రాజా దంపతుల కుమార్తె అంకిత ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది.మెదడులోని నరంలో రక్తం గడ్డ కట్టడంతో నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో కొన్నాళ్లుగా వైద్య చికిత్స పొందుతోంది. ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికే కష్టపడి పరీక్షలు రాస్తోంది. ఈ నేపథ్యంలో ఆఖరు పరీక్ష రాయడానికి సిద్ధమవుతుండగా ఆసుపత్రిలో నురగలు కక్కుకుని మరణించింది. దీంతో హతాశులైన తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. ఆమెకు రక్తం ఎక్కించిన వైద్యులు పట్టించుకోకపోవడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులు బోరున విలపించారు. లక్షన్నర ఖర్చు చేసినప్పటికి బిడ్డ దక్కలేదని ఫోర్ సైడ్స్ టీవీతో మాట్లాడుతూ వాపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కేసు నమోదు చేయాలని, ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
Discussion about this post