విశాలమైన నాలుగు లైన్ల రోడ్డు వేస్తున్నారని, ఇక ఊరి కష్టాలు తీరతాయని బీర్కూరు ప్రజలు ఎంతో సంతోషపడ్డారు, కానీ ఇంతలోనే వారి సంతోషానికి బ్రేకులు పడ్డాయి. రోడ్డు నిర్మాణ పనులు నత్త నడకన సాగుతుండటంతో అటు జనం.. ఇటు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ శివారులో మంజీరా నదిపై భారీ వంతెన నిర్మించడంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు వాహనాల రాకపోకలు పెరిగాయి. వాహనాల రద్దీ సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వం నాలుగు వరుసల రోడ్డును మంజూరు చేసింది. దీని నిర్మాణానికి ఏడు కోట్ల 20 లక్షల రూపాయలు కేటాయించింది. 2023 మే 28న అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. రెండు నెలల తర్వాత పనులు ప్రారంభమయ్యాయి.
బీర్కూర్ గ్రామ ముఖద్వారం నుంచి బాయిలర్ రైస్ మిల్ వరకు 1.4 కిలోమీటర్ల పొడవున ఇరువైపులా 43 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. గత ఐదు నెలల్లో మొత్తం నాలుగు లేయర్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి రెండు బాక్స్ కల్వర్ట్స్ పూర్తి చేయగా ఒక బాక్స్ కల్వర్టు ఇంకా నిర్మించాల్సి ఉంది.
రహదారి తవ్వకాల్లో మిషన్ భగీరథ పైప్ లైన్లు ధ్వంసం కావడం, శాఖల మధ్య సమన్వయ లోపం వంటి కారణాల వల్ల పనులు జరగక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణ పనుల కోసం దుకాణ సముదాయాల్లో కొంత భాగం తొలగించడంతో చిరు వ్యాపారులు దుకాణాలను మూసుకోవాల్సి వచ్చింది. రోడ్డు పనుల వల్ల వస్తున్న దుమ్ముధూళి వల్ల వ్యాపారం నడవటం లేదని, దీంతో చాలా ఇబ్బంది పడుతున్నామని వ్యాపారస్తులు వాపోతున్నారు.
రోడ్డు పనులు పూర్తి కాకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. గోతుల కారణంగా వాహనాల మీద నుంచి పడిపోతున్నామని చెబుతున్నారు. దుమ్ము ధూళి వల్ల తాగు నీరు కలుషితమవుతోందని అంటున్నారు. కాంట్రాక్టర్ పై మండి పడుతున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవటం లేదని విమర్శిస్తున్నారు.
Discussion about this post