వేసవిలో సహజ సిద్ధమైన చల్లటి నీరు కావాలంటే కుండలనే వినియోగించాలి. అదే ఫ్రిజ్ లో ఉంచిన నీళ్లను తాగితే దాహం తీరటం సంగతి అటుంచి రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే వేసవిలో కుండల వినియోగం పెరుగుతుంది. కానీ వాటిని తయారు చేస్తున్న కుమ్మరుల జీవితాలు మాత్రం మోడువారిపోతున్నాయి. కష్టాల చక్రంపై తిరుగుతున్న కుమ్మరుల జీవన పోరాటంపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం.
మధ్య శిలాయుగంలోనే కుండలు తయారు చేసి ప్రపంచానికే నాగరికత నేర్పిన కుమ్మరుల జీవితం.. తిరిగే చక్రం లాంటిదే. చెరువు నుంచి నల్లని మట్టి తెచ్చి కాలితో తొక్కి.. చేతితో పిసికి.. కండలు కరిగించి.. కుండలకు రూపం ఇచ్చేవారు కుమ్మరులు. ప్రస్తుతం కుల వృత్తిని వదులుకోలేక వేరే పని చేయడానికి అవకాశం దొరకక ఇబ్బందులు పడుతున్నారు.
చెరువు నుంచి మట్టిని తెచ్చి నీటితో తడిపి ముద్ద చేస్తారు. ఆ మట్టిని వినియోగించి కుమ్మరి చక్రంపై కుండకు రూపాన్ని ఇస్తారు కుమ్మరి కళాకారులు. మనిషి జీవితంలో పుట్టుక నుండి చావు వరకు మధ్యలో ఏ శుభకార్యమైనా కుండ తప్పనిసరిగా అవసరం. చివరకు మనిషి చనిపోయినప్పుడు కూడా కుండతోనే అంతిమ యాత్ర జరుగుతుంది.
తరతరాలుగా తిండి పెట్టిన కులవృత్తి నేడు అక్కరకు రాకుండా పోయిందని కుమ్మరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి పాత్రలు, కుండల స్థానంలో ఆధునిక ప్లాస్టిక్ వస్తువులు వచ్చి చేరడంతో తాము కష్టపడి కుండలు తయారు చేసినప్పటికీ పెద్దగా కొనుగోలు చేయడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని కుమ్మరుల సంఘం రాష్ట్ర నేత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Discussion about this post