మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై భారీగానే పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
తుఫాన్ ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, నల్లగొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదుగుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతకుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని, టార్పాలిన్ల పంపిణీపై దృష్టి పెట్టాలని సూచించారు.
Discussion about this post