నల్లగొండలో ఘోరం .. కన్న కూతురే నలుగురి ప్రాణాలు.. | Nalgonda Family Incident

నల్గొండ జిల్లా కేంద్రంలో కలకలం రేపిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. తొలుత ఈ దారుణానికి ప్రేమ వ్యవహారమే కారణమని భావించినప్పటికీ, ఆస్తి వివాదమే అసలు కారణమని దర్యాప్తులో తేలింది.

ఈ దారుణ హత్యోదంతానికి మృతురాలు హసీనా కూతురు, అల్లుడే సూత్రధారులుగా మారి పక్కా ప్రణాళిక రచించారు. హైదరాబాద్‌కు చెందిన ఒక సుపారీ ముఠాతో చేతులు కలిపి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో సుపారీ ముఠాతో కలిపి మొత్తం 8 మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

దర్యాప్తు ప్రారంభంలో, హత్యకు గురైన కుటుంబంలోని కుమారుడు ముజామిల్‌కు మిర్యాలగూడకు చెందిన ఓ బంధువుల అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయమై గతంలో యువతి కుటుంబ సభ్యులు ముజామిల్‌ను పలుమార్లు హెచ్చరించారు. తనకు ప్రాణాపాయం ఉందంటూ ముజామిల్ గతంలో పెట్టిన వాట్సాప్ స్టేటస్‌ను కూడా పోలీసులు పరిశీలించారు. అయితే కేవలం ప్రేమ వ్యవహారమే అయితే కుటుంబ సభ్యులను, సోదరిని కూడా ఇంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏముందనే కోణంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో విచారణ జరపడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.

హత్య జరిగిన ఇల్లు మృతురాలు హసీనాకు చెందినది. సుల్తాన్‌తో పెళ్లి కాకముందే హసీనా ఈ ఇంటిని నిర్మించుకుంది. ఈ క్రమంలోనే ఆస్తిని దక్కించుకోవాలనే దురాశతో హసీనా మొదటి భర్త కూతురు, అల్లుడు ఈ ఘోరానికి ఒడిగట్టారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఐజీ షానవాజ్ ఖాసీం నిన్న ప్రత్యేకంగా జూమ్ మీటింగ్ నిర్వహించి దర్యాప్తును సమీక్షించారు. పోలీసులు ఇంటి సమీపంలోని ప్రతి ఒక్కరిని ఆరా తీసి, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను పట్టుకున్నారు. కన్నవారిని, తోడబుట్టిన వారిని ఆస్తి కోసం సుపారీ ముఠాతో చంపించడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top