తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.

ఉదయం రాజమండ్రి రూరల్ మండలం వెంకట్ నగరం గ్రామంలో ఆంధ్రా పేపర్ మిల్లు వ్యర్థ జలాలు కలుస్తున్న లంకలను పరిశీలించారు. బోటుపై ప్రయాణించిన డిప్యూటీ సీఎం.. ఆంధ్రా పేపర్ మిల్లు నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు నేరుగా గోదావరి నదిలో కలుస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. కాలుష్యం వల్ల స్థానికులు, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించారు. బోటులో ప్రయాణిస్తున్న సమయంలో స్థానిక మత్స్యకారులతో డిప్యూటీ సీఎం మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గోదావరి నదీ జలాల కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి సారించిన పవన్…

అధికారులతో గోదావరిలో కలుస్తున్న పేపర్ మిల్ కాలుష్య వ్యర్ధాల శాంపిల్స్ తీయించారు. పవన్ ఆకస్మిక తనిఖీతో ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరిలో కాలుష్య వ్యర్ధాలు కలవడం దారుణమన్నారు. పుష్కరాలకు ఈ నీళ్లలో స్నానం చేస్తే పుణ్యం కాదు రోగాలు వస్తాయని వ్యాఖ్యానించారు. ఏలూరులో తాగునీటి కాలుష్యం కారణంగా సంభవించిన మరణాలు మర్చిపోయారా అని ప్రశ్నించారు.
రాష్ట్రానికి పరిశ్రమలు, ఉపాధి మాత్రమే కాదు.. పర్యావరణం కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. అసెంబ్లీ, క్యాబినెట్ సమావేశంలో పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యంపై చర్చిస్తామన్నారు. పర్యావరణాన్ని కాపాడమంటే.. పరిశ్రమలు ఎందుకు ఆగిపోతాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
Follow for more updates
