వైద్యో నారాయణో హరి అంటారు పెద్దలు… అలాంటి పవిత్ర వృత్తిలో ఉన్న వైద్యులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం వ్యాపారంగా మారింది. మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ నర్సింగ్ హోమ్ ల పేరిట వెలసిన ఆస్పత్రులు దోపిడీకి పాల్పడుతున్నాయి. ఇక కొంతమంది అయితే అర్హత లేకుండా వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఇంకొంతమంది కేవలం కాసుల కోసమే సంబంధం లేని టెస్టులు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు ధనార్ధనే ధ్యేయంగా ఈ తరహాలో ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు.
ఇక ఆసుపత్రుల పేరుతో చేస్తున్న దోపిడీ సరిపోలేదన్నట్టు మెడికల్ షాపుల పేరిట మరో దందాకు తెర తీస్తున్నారు. నాడీ పరీక్ష చేసి దానికి అనుగుణంగా కొద్దిపాటి మందులు రాయాల్సిన వైద్యులు అవసరం లేకున్నా రోగులను ఆసుపత్రిలో చేర్పించుకుంటున్నారు. రకరకాల పరీక్షలతో అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారు. అది సరిపోదు అన్నట్లు తమకే చెందిన మెడికల్ షాపుల్లో మందులు కొనాలని చెబుతుంటారు. ఇందులో జనరిక్ మందులను కూడా ఇస్తూ మరో రక దోపిడీ చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్న వైద్య వ్యాపారంలో ఈ జిల్లాకు చెందిన ధనవంతులు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. జిల్లాకు చెందిన ధనవంతులైన కొంతమంది ఆసుపత్రులను నిర్మించి అద్దె ప్రాతిపదికన వైద్యులను తీసుకొస్తున్నారు. స్థానికంగా గ్రామాల్లో ఆర్ఎంపీలుగా పనిచేసే వారికి కమిషన్లు ఎరచూపి పేషెంట్లను ఆస్పత్రికి తీసుకువచ్చేలా ప్రలోభ పెడుతున్నారు. వైద్య వృత్తి ముసుగులో ఈ వ్యాపారమంతా ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. జిల్లాలో డెంటల్, మల్టీ స్పెషాలిటీ, ఫిజియోథెరపీ, సూపర్ స్పెషాలిటీ ఇలా రకరకాల ఆస్పత్రులు వెలిశాయి. ఈ విధంగా వెలిసిన చాలా ఆసుపత్రిలో కనీస నిబంధనలు కూడా పాటించడం లేదు.
చాలావరకు ఆసుపత్రి భవనాలన్నీ నిబంధనలకు విరుద్ధంగానే వెలిశాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల పలు సంఘటనలు చోటు చేసుకోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల తీరు వివాదాస్పదం అవుతుంది. ధనార్జన ధ్యేయంగా కాసులు గుంజుతున్న ప్రైవేట్ ఆస్పత్రులు రోగుల ప్రాణాలకు గ్యారెంటీ మాత్రం ఇవ్వడం లేదు. నిజాంబాద్ లో ఇంత జరుగుతున్న వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రల్లో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటే… ధర్పల్లి మండలానికి చెందిన పది నెలల పసి గుడ్డుకు కాలం చెల్లిన ఇంజక్షన్ ఇవ్వడంతో పసిగుడ్డు మరణించాడు. ఈ దుర్ఘటన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐదు రోజుల చికిత్స పూర్తయిన తర్వాత డిశ్చార్జి సమయంలో జరిగింది. ఓ గర్భిణి వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు దీంతో పది లక్షల రూపాయల చెక్కించి చేతులు దులుపుకున్నారు. ఛాతిలో నొప్పి కారణంగా కార్పొరేట్ ఆసుపత్రిలో చేరిన ఓ యువకునికి ఆరోగ్య పథకం శ్రీ పథకం కింద వైద్యం చేసే అవకాశం ఉన్నప్పటికీ 80 వేల రూపాయలు వసూలు చేశారు. సకాలంలో వైద్యం అందించకపోవడంతో యువకుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన నగరంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో జరిగింది.
ఇలా చెప్పుకుంటూ పోతే నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగిన ఘోరాలు అనేకం ఉంటాయి. డాక్టర్ చూడకముందే టెస్టులు, రోగం తెలవక ముందే మందులు, ఆసుపత్రిలో చేరకముందే ఫీజులు వసూలు చేస్తూ అందినంత దోచుకుంటున్నారు. జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఇటీవల వైద్య అధికారులు తనిఖీ చేశారు. మొత్తం 529 ఆసుపత్రులు ఉన్నట్టు గుర్తించగా వాటిలో కేవలం 394 ప్రైవేట్ ఆస్పత్రిలకు మాత్రమే రిజిస్ట్రేషన్ ఉన్నట్లు తేలింది. 122 ఆసుపత్రిలకు రిజిస్ట్రేషన్ లేదని తేలింది. అదే విధంగా 127 హాస్పిటల్స్ లో కనీసం ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు కూడా లేవు. కొన్నింటిని మాత్రమే తనిఖీ చేసిన అధికారులు మిగతావి పట్టించుకోకుండా చేతులు దులుపుకున్నారు.
Discussion about this post