మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో కొంతకాలంగా జరుగుతోన్న నిరశనలు చివరకు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశాన్నే విడిచి పారిపోయేలా చేశాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఒక యూనివర్సిటీలో విద్యార్థులతో మొదలైన ఉద్యమం అనంతరం ప్రధాని రాజనామా చేయాలనే వరకు వెళ్లింది. చివరకు పరిస్థితి ముదిరి ప్రధాని ఆ దేశాన్ని వదిలి వేరేదేశం పారిపోయోలా చేశాయి. ఇంతటి పరిస్థితికి కారణమైన అంశాలేమిటి? రిజర్వేషన్లే కారణమా? ఇందులో మరో కోణమేదైనా ఉందా? ఇవి తెలియాలంటే బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఆ దేశంలో చోటు చేసుకున్న పరిస్థితులు అర్థం చేసుకోవాలి.
షేక్ హసీనీ 1947 సెప్టెంబరులో జన్మించారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె హసీనా. 1960ల చివర్లో ఢాకా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పటి నుంచే రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించారు. వాస్తవానికి బంగ్లాదేశ్ రాజకీయాల్లో షేక్ హసీనాది చెరగని పాత్ర. ఏళ్లపాటు సైనిక పాలనలో నలిగిన బంగ్లదేశ్ కు ఆమె స్థిరత్వం తీసుకొచ్చారు. తన పాలనతో ప్రగతి రథాన్ని పట్టాలెక్కించారు. రాజకీయ ప్రత్యర్థులను దాదాపు నిస్సహాయులుగా మార్చేసి… ‘ఉక్కు మహిళ’ అంటూ మద్దతుదారులతో ప్రశంసలందుకున్నారు. అలాంటి హసీనా- తాజాగా అనూహ్య పరిస్థితుల్లో ప్రధాని పీఠం నుంచి వైదొలిగి… దేశం కూడా వీడారు.
1971లో పాక్ నుంచి బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం సిద్ధించింది. హసీనా తండ్రి దేశాధ్యక్షుడిగా… తర్వాత ప్రధానిగా కూడా పనిచేశారు. 1975 ఆగస్టులో ముజిబుర్, ఆయన భార్య, ఆ దంపతుల ముగ్గురు కుమారులు వారి ఇంట్లోనే మిలిటరీ అధికారుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. అప్పటికి ముజిబుర్ దంపతుల సంతానంలో మిగిలింది హసీనా, ఆమె చెల్లి షేక్ రెహానా మాత్రమే. తమ ఇంట్లో హత్యాకాండ చోటు చేసుకున్న రోజు విదేశాల్లో ఉండటంతో వారిద్దరూ ప్రాణాలు దక్కించుకోగలిగారు. తల్లిదండ్రులు, సోదరులు హత్యకు గురయ్యాక హసీనా బంగ్లాదేశ్ను వీడారు. ఆరేళ్ల పాటు భారత్లో ప్రవాస జీవితం గడిపారు. తండ్రి స్థాపించిన అవామీలీగ్ అధినాయకురాలిగా ఎన్నికయ్యాక 1981లో స్వదేశానికి తిరిగొచ్చారు.
అప్పటికి సైనిక పాలనలో మగ్గుతున్న బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం కోసం గళమెత్తారు షేక్ హసీనా. ఫలితంగా పలుమార్లు గృహ నిర్బంధానికి గురయ్యారు. 1991 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని ఆమె నేతృత్వలోని అవామీలీగ్ సాధించలేకపోయింది. అయితే 1996 ఎన్నికల్లో అవామీలీగ్ విజయంతో హసీనా తొలిసారి బంగ్లాదేశ్ ప్రధాని పీఠమెక్కారు. కానీ ఐదేళ్లు తిరిగే సరికి పదవి కోల్పోయారు. 2008 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో తిరిగి అధికారం దక్కించుకున్న హసీనాకు ఆ తర్వాత తిరుగే లేకుండాపోయింది.
అప్పటినుంచీ బంగ్లాదేశ్ లో హసీనా అప్రతిహత పాలన సాగుతోంది. 1971 నాటి యుద్ధనేరాలపై హసీనా ఓ ట్రైబ్యునల్ను ఏర్పాటు చేశారు. విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలను ట్రైబ్యునల్ దోషులుగా తేల్చింది. ఫలితంగా హింస చోటుచేసుకుంది. బీఎన్పీ కీలక మిత్రపక్షమైన జమాత్-ఎ-ఇస్లామీ ఎన్నికల్లో పాల్గొనకుండా 2013లో నిషేధం విధించారు. మరోవైపు- అవినీతి ఆరోపణలపై ఖలీదా జియాకు 17 ఏళ్ల జైలుశిక్ష పడింది. 2014 ఎన్నికలను బాయ్కాట్ చేసిన బీఎన్పీ… 2018లో తిరిగి బరిలో దిగింది. అయితే ఆ రెండుసార్లు కూడా అవామీలీగ్నే విజయం వరించింది. తాజాగా ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికలకు బీఎన్పీ, దాని మిత్రపక్షాలు బాయ్కాట్ చేశాయి. హసీనా వరుసగా నాలుగోసారి… మొత్తంగా ఐదోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
బంగ్లాదేశ్ ను సైనిక పాలన నుంచి ప్రజా పాలనలోకి తీసుకొచ్చి ఐదు సార్లు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షేక్ హసీనాపై హసీనాపై విమర్శలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులు ఆమెను నియంతగా చెబుతారు. ఆమె పాలనలో అవినీతి రాజ్యమేలుతోందంటూ అనేకసార్లు విమర్శలు చేశారు. హసీనా భర్త అణు శాస్త్రవేత్త. ఆయన 2009లో మరణించారు. ఆ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. హసీనాపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. అత్యధిక కాలం ఓ దేశానికి ప్రభుత్వాధినేతగా కొనసాగిన మహిళా నేతల్లో హసీనా ఒకరు.
ఇదంతా సరే… ఇక అసలు తాజా వివాదానికి కారణమైన కోటా విషయానికొస్తే… 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పోరాడినవారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ పునరుద్ధరణ జరగడం ప్రస్తుతం హసీనా కొంపముంచింది. అవామీలీగ్ మద్దతుదారులకు ప్రయోజనం కల్పించేలా ఆ రిజర్వేషన్ ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సంబంధిత కోటాను ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. శాంతియుతంగా మొదలైన నిరసనలు తర్వాత హింసాత్మకంగా మారాయి. వందలమంది ప్రాణాలు కోల్పోయారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని రిజర్వేషన్లను కుదించాలని ఆదేశించింది. అందుకు హసీనా సర్కారు అంగీకరించింది. తాజాగా మళ్లీ ఘర్షణలు చెలరేగడంతో హసీనా పదవి నుంచి దిగిపోక తప్పలేదు.
వాస్తవానికి రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమానికి నేపథ్యాన్ని పరిశీలిస్తే… 1971లో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడం సాధారణంగా జరగలేదు. ప్రస్తుతం దేశం విడిచి పారిపోయిన షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబిర్ రెహమాన్ నేతృత్వంలోని ముక్తీ వాహినీ… అవామీలీగ్ పోరాట సైన్యం పాకిస్థాన్ సైన్యంతో పోరాటం చేసింది. ఆ సమయంలో సుమారు 30లక్షల మంది బంగ్లాదేశ్ పౌరులు ఊచకోతకు గురయ్యారు. అనేక లక్షల మంది ఆస్తులు ద్వంసమయ్యాయి. మహిళలపై అత్యాచారాలు జరిగాయి. అతి క్రూరమైన దమనకాండను ఆనాడు పాకిస్థాన్ ఆర్మీ, దాని మద్దతుదారులైన పారా మిలిటరీ రాడికల్ సంఘాలు జరిపాయి. వీరిని బంగ్లాదేశ్ రజాకార్లు అంటారు. వీరి దమనకాండతో నష్టపోయిన వారి కోసం రెహమాన్ ప్రధాని అయిన తర్వాత రిజర్వేషన్లు తీసుకొచ్చారు.
నాడు తీసుకొచ్చిన రిజర్వేషన్ల ప్రకారం బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో మొత్తం 56శాతం రిజర్వేషన్లు ఉంటాయి. ఈ 56శాతం రిజర్వేషన్లలో 30శాతం అమరవీరుల కుటుంబాలకు చెందిన వారికే ఉంటాయి. ఈ రిజర్వేషన్లు ఇవ్వడాన్ని అవామీలీగ్ వ్యతిరేక పార్టీలు వ్యతిరేకించాయి. అయితే ఈ రిజర్వేషన్లు కూడా బంగ్లాదేశ్ లో నిరంతరం కొనసాగిన దాఖలాలు కనిపించవు. అవామీలీగ్ అధికారంలో ఉన్నప్పుడు అమలవుతూ… బంగ్లా నేషనలిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అదే విధంగా ఆర్మీ పాలన సమయంలోనూ అమలు కాలేదు. అంటే బంగ్లాదేశ్ లో సందర్భోచితంగానే రిజర్వేషన్లు అమలయ్యాయి. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. ఫలితంగా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ తాజాగా ఢాకా యూనివర్సిటీలో ఉద్యమం మొదలయింది.
అయితే ప్రస్తుతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తున్న విద్యార్థులు చెబుతోన్న వాదన ఏమిటంటే… నాటి అమరవీరుల కుటుంబాలు 50ఏళ్లుగా రిజర్వేషన్లు అనుభవించారు కదా… ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలే పరిమితం వాటిల్లో ఇప్పటికీ రిజర్వేషన్లు ఎందుకనేది వారి ప్రశ్న. కానీ ఈ రిజర్వేషన్లను వాస్తవానికి షేక్ హసీనా ప్రభుత్వం గతంలోనే రద్దు చేసింది. కానీ హైకోర్టు తీర్పు కారణంగా రిజర్వేషన్లు పున:రుద్దరించారు. అది ప్రస్తుతం హసీనా మెడకు చుట్టుకుంది. నిజానికి రిజర్వేషన్లపై పోరాటమైతే అది అక్కడికే పరిమితం కావాలి. ప్రభుత్వంపై పోరాటమైనే హసీనాకు వ్యతిరేకంగా కొనసాగాలి. కానీ షేక్ ముజిబిర్ రెహమాన్ విగ్రహం కూడా ద్వంసం చేసే వరకు వెళ్లిందంటే… ఇందులో బంగ్లాదేశ్ ఏర్పాటును వ్యతిరేకించిన రాడికల్ ఇస్లామిక్ సంస్థలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.
ఇక ప్రస్తుత హసీనా భారత్ లో ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆమె లండన్ వెళుతారనే ప్రచారం నడుస్తోంది. బంగ్లాదేశ్ లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఇప్పటికిప్పుడే అర్థమయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఆర్మీ మాత్రం అధికారాన్ని కోరుకోవడం లేదని ఆర్మీ చీఫ్ ప్రకటనను బట్టి అర్థం అవుతోంది. ప్రధాని నివాసంలోకి చొరబడి మరీ వస్తువులు ఎత్తుకెళ్లే పరిస్థితులు వచ్చాయి. బంగ్లాదేశ్ లోని ర్యాడికల్ ఇస్లామిక్ సంస్థలు ఎలాంటి అడుగులు వేస్తాయి? హసీనా ఏ నిర్ణయం తీసుకోనున్నారు? బంగ్లాదేశ్ లో ఆమె మద్దతుదారుల పరిస్థితి ఏమిటి? అనేది భవిష్యత్తుల తేల్చాలి.
Discussion about this post