మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ..

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో కీలక సమావేశం కానుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు సమీపిస్తున్న తరుణంలో, ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Telangana Cabinet Meeting

ప్రభుత్వ శాఖల్లో పొదుపు చర్యలు, విద్యుత్ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు, ప్రజా రంజక సంక్షేమ పథకాలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం సాగనుంది. ప్రధానంగా రాష్ట్రంలో డిస్కంల నష్టాల నివారణపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందులో భాగంగానే జూన్ 2 నుంచి ‘రైతు డిస్కం’ అమలుపై చర్చించనున్నారు. వ్యవసాయ రంగంలో హై-ఎఫిషియెన్సీ పంప్‌సెట్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

కొండారెడ్డిపల్లి తరహాలో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ‘సోలార్ విలేజెస్’ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మహిళలకు లబ్ధి చేకూర్చేలా ‘సోలార్ స్టవ్ స్కీం’ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంపై కేబినెట్ ముందడుగు వేయనుంది.

అలాగే, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు వీలుగా ప్రత్యేక గైడ్‌లైన్స్ వచ్చే అవకాశం ఉంది. కరెంట్, డీజిల్, పెట్రోల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు, ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పంటల మార్పిడి దిశగా రైతులకు ముఖ్యమంత్రి సరికొత్త యాక్షన్ ప్లాన్‌ను ప్రతిపాదించనున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించేందుకు సీఎం స్వయంగా ‘రైతు వేదికల’ పర్యటనలకు సిద్ధమవుతున్నారు.

వీటితో పాటు ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకే జమ చేసే విధానానికి రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ విధివిధానాల ఖరారుతో పాటు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులకు ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీలో భూముల కేటాయింపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. జూన్ 2న నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కూడా ఈ భేటీలో సమగ్రంగా చర్చించి, మంత్రులకు బాధ్యతలను అప్పగించనున్నారు.

Follow for more updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *