తమకు ఎసరు తప్పదని భయపడుతున్న టీడీపీ నేతలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పటికే నిర్ణయించినప్పటికీ సీట్ల పంపకంపై ఇంకా అవగాహనకు రాలేదు. ఎన్నికలకు మరో మూడునాలుగు నెలలే సమయం ఉండటంతో రెండు పార్టీల ఆశావహులు తమ తమ నియోజకవర్గాలలో పనిచేసుకుపోతున్నారు. సీట్ల పంపకంపై క్లారిటీ రాకపోవటం, రాష్ట్రంలో జనసేన ఆశిస్తున్న సీట్లు ఇవేనంటూ ఉధృతంగా ప్రచారం జరుగుతుండటంతో టీడీపీ ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది.
ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కోరుకున్న సీట్లతో సహా మొత్తంగా 25 నుంచి 30 సీట్లు ఇవ్వటానికి టీడీపీ అంగీకరించినట్లు చెబుతున్నారు. పొత్తులో భాగంగా జనసేన..శ్రీకాకుళం జిల్లాలో ఒక స్థానం కోరుతోంది. విజయనగరం జిల్లాలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. విశాఖ నగరంలోని గాజువాక నుంచి జనసేన పోటీ చేయడం ఖాయమని చెబుతున్నారు. జిల్లాలోని మాడుగులపై చర్చ జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పూర్తయిన పిఠాపురం, కాకినాడ రూరల్, పి.గన్నవరం, రాజోలుతో పాటు అమలాపురం నుంచి జనసేన బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. రాజానగరంపై స్పష్టత రావాల్సి ఉంది. రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేన కూడా ఈ సీటును ఆశిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నర్సాపురం, తాడేపల్లి గూడెం, నిడదవోలు, అవనిగడ్డ, పెడన, కైకలూరు సీట్లను .. కృష్ణా జిల్లాలోని విజయవాడ వెస్ట్, గుంటూరు జిల్లాలోని తెనాలి, గుంటూరు పశ్చిమం, ప్రత్తిపాడు సీట్లను జనసేన కోరుతోందని చెబుతున్నారు. తిరుపతి, దర్శి, నెల్లూరు సిటీ సీట్లను కూడా జనసేన కోరుతోందని అంటున్నారు.
రాయలసీమలోని వైస్సార్ కడప జిల్లా రాజంపేట, రైల్వేకోడూరు సెగ్మెంట్లను జనసేన డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బలిజ కమ్యూనిటీ ఈ రెండు సెగ్మెంట్లలలో గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉంది. రాజంపేటలో జనసేన, టీడీపీ రెండు పార్టీలకు బలమైన ఆశావహులు ఉన్నారు. రాజంపేటలో జనసేన టికెట్ కోసం ముగ్గురు, టీడీపీ టికెట్ కోసం ముగ్గురు పోటీ పడుతున్నట్లు చెబుతున్నారు. పొత్తులో భాగంగా రైల్వే కోడూరు లేదా రాజంపేటను జనసేనకు కేటాయిస్తారని అంచనా వేస్తున్నారు.
Discussion about this post