ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్టు రద్దుకు సీఎం రేవంత్ యోచన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రూట్ మారుతుందన్న వార్తలొస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సంచలన నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మెట్రో విషయంలోనూ మార్పులు తప్పవని తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్టును రద్దు చేయాలని సీఎం భావిస్తున్నట్టు చెబుతున్నారు.
మెట్రో రైల్ సౌకర్యాన్ని హైదరాబాద్ నగరం చుట్టూ విస్తరించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 69 వేల కోట్ల రూపాయలతో మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం కాగా టెండర్ల దశలో ఉన్నప్పుడే ప్రాజెక్టు పనులకు అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన కూడా చేశారు.
వాయిస్కొత్త ప్రాజెక్టులో భాగంగా పటాన్ చెరు నుంచి నార్సింగ్ వరకు 22 కిలోమీటర్లు, తుక్కుగూడ నుంచి పెద్ద అంబర్పేట వరకు 40 కిలోమీటర్లు, తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు 8 కిలోమీటర్లు, మేడ్చల్ నుంచి పటాన్చెరు వరకు 29 కిలోమీటర్లు, ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు మెట్రో కారిడార్ని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో లైన్ పొడిగించాలని తీర్మానించారు.
అయితే తాజాగా.. మెట్రో విస్తరణ పనులకు సీఎం రేవంత్ బ్రేకు వేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓఆర్ఆర్ మెట్రో విస్తరణ ప్రాజెక్టు అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రో విస్తరణ అవసరం లేదని.. అది కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేందుకు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని సీఎం చెప్పినట్టు తెలుస్తోంది.
దీనికి బదులుగా పెండింగ్లో ఉన్న జేబీఎస్ – ఫలక్నుమా మెట్రో కారిడార్ను పూర్తి చేసి.. పహాడీ షరీఫ్ ద్వారా విమానాశ్రయం వరకు మెట్రోను విస్తరించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ మార్గాన్ని ఎంచుకోవటం ద్వారా ఓల్డ్ సిటీ కూడా కవర్ అవుతుందని.. ఇది చాలా మందికి ఉపయోగంగా ఉంటుందనేది సీఎం రేవంత్ ఆలోచన అని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Discussion about this post