తెలంగాణ గట్టుపై బడేభాయ్.. ఛోటాభాయ్ ముచ్చట హాట్ టాపిక్గా మారింది. అదిలాబాద్ వేదికగా ప్రధానికి విన్నపాలు వినిపించేశారు సీఎం రేవంత్.రాష్ట్రానికి ఏం కావాలో టైమ్ చూసి మరీ అడిగేశారు. మరి మోదీ రియాక్షన్ ఏంటి?ముఖ్యమంత్రి అడిగిన వరాలకు ప్రధానమంత్రి తధాస్తు అనేస్తారా?
ప్రధాని మోదీ తమకు పెద్దన్న అంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ రాజకీయంగా ఆసక్తిరేపాయి. గతంలో మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు గత ప్రభుత్వం పట్టించుకోలేదు.ప్రోటోకాల్ ను పాటించలేదు. మోడీ రాష్ట్రానికి వచ్చినపుడు కేసీఆర్ స్వాగతం పలకలేదు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మాత్రం ప్రొటోకాల్ పాటిస్తోంది. ప్రధానికి ముఖ్యమంత్రి రేవంత్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకొనే దృశ్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
ఆ ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది పక్కన పెడితే.. సీఎం రేవంత్ టైమ్ చూసి విన్నపాల లిస్ట్ చదివేశారు. గుజరాత్ తరహాలో తెలంగాణ ముందుకెళ్లాలంటే మోదీ మద్దతు ఉండాలన్నారు రేవంత్. అందుకు బడేభాయ్ ఆశీర్వాదం కావాలన్నారు. మెట్రో రైల్ విస్తరణ, సెమీకండక్టర్ ఇండస్ట్రీ, మూసీ రివర్ డెవలప్మెంట్తో పాటు ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటిని అందించేందుకు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలని రేవంత్ కోరారు.
Discussion about this post