ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లాకప్డెత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు.

అలాగే కాసేపట్లో బాబురావుని కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోపక్క సీఐ నాగరాజు మిత్రుడు సురేష్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఐ నాగరాజుకు సురేష్ సహకరించినట్టు గుర్తించిన అధికారులు.. లాకప్ డెత్ తర్వాత పరిణామాలపై ప్రశ్నిస్తున్నారు. పోలీసుల విధుల్లో సురేష్ జోక్యం.. నాగరాజుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు కేసులో కీలకంగా భావిస్తున్న పరారీలో ఉన్న కానిస్టేబుళ్ల కోసం కూడా ముమ్మర గాలింపు కొనసాగుతోంది. సెంట్రల్ డివిజన్ టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన సెట్… అనుమానితుల కోసం హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు కూడా టీమ్స్ని పంపింది. మరీ ముఖ్యంగా పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టింది.
సాయికృష్ణ మృతి, శవం మాయం వ్యవహారంలో పాత్ర ఉందని ఖరారుచేసిన నేపథ్యంలో వీరి కోసం వేట కొనసాగుతోంది. వీరిని అదుపులోకి తీసుకుని తమ ముందు హాజరుపర్చాలని సౌత్ ఏసీపీకి సిట్ అధికారులు ప్రొడక్షన్ ఆన్ మెమో ఇచ్చారు. ఈ కేసులో వీరిని సిట్ నిందితులుగా చేర్చింది. వారిద్దరినీ నగర సీపీ రాజశేఖరబాబు సస్పెండ్ చేశారు. వీరు దొరికితే కేసు చిక్కుముడి వీడొచ్చని భావిస్తున్నారు.
ఇటు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. తన కుమారుడి లాకప్డెత్ కేసు దర్యాప్తు బాధ్యతలను స్థానిక పోలీసుల నుంచి తప్పించి సీబీఐ అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. CI నాగరాజు అరెస్ట్ కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే అంటూ ఆరోపించారు. దోషులను శాశ్వతంగా తప్పించాలన్నదే పోలీసుల ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుందన్నారు.
ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఇక విజయలక్ష్మి పిటిషన్పై రేపు విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు. అలాగే, సాయికృష్ణ కేసులో సస్పెండైన సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో సిట్ కీలక అంశాలు ప్రస్తావించింది. సాయికృష్ణను లాకప్ డెత్ చేసినట్డు రిమాండ్ రిపోర్ట్లో సిట్ స్పష్టం చేసింది. లాకప్డెత్ను దాచేందుకు సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారని.. మృతదేహాన్ని పూడ్చిపెట్టడమో, తగలబెట్టడమో చేసేందుకు ప్రయత్నించారు. మృతదేహం ఇంకా లభించలేదని.. ఏం చేశారనే దానిపై దర్యాప్తు చేయాల్సి ఉందని కూడా సిట్ వివరించింది.
అంతేకాకుండా విచారణలో భాగంగా సిట్ అధికారులు.. సౌత్ ఏసీపీ మానసను పిలిచారు. ఆమెపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సాయికృష్ణ అదృశ్యం గురించి మీకు ఎప్పుడు తెలిసింది? తర్వాత మీరు అంతర్గత విచారణ చేయించారా? చేస్తే.. అందులో ఏం తేలింది? మృతదేహం ఏమైందని ప్రశ్నించారు. ఇన్స్పెక్టర్పై పర్యవేక్షణ అధికారి అయి ఉండి ఎందుకు పూర్తిస్థాయిలో విచారణ చేయలేదని అడిగినట్లు తెలిసింది.
Follow for more updates
