వేసవిలో అందరూ ఎంతో ఇష్టంతా తినే మామిడి పండ్లు నిండు ప్రాణాలను బలికొన్నాయి. మామిడి పండ్లను త్వరగా మాగబెట్టడానికి కొందరు వ్యాపారులు కృత్రిమ రసాయాలను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఇలా మాగపెట్టిన మామిడి పండు తిని ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మామిడి పండ్లు తిన్న అనంతరం అస్వస్థతకు గురై ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్లోని నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం అక్క భువనేశ్వరి మృతి చెందగా, మంగళవారం చెల్లెలు సంధ్య చికిత్స పొందుతూ కన్నుమూసింది. కర్నాటక బీదర్కు చెందిన వైజినాథ్, ఇందుమతి దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చి విఠల్వాడిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల వారి బంధువైన రేణుక ఇంటికి వస్తూ నారాయణగూడ జలమండలి సమీపంలో మామిడి పండ్లు కొనుగోలు చేసింది. వాటిని తీసుకొని వైజినాథ్ ఇంటికి వచ్చింది. ఆ పండ్లను ఇందుమతితో పాటు ఆమె నలుగురు కుమార్తెలు తిన్నారు. ఆదివారం సాయంత్రం పండ్లు తిన్న ఐదుగురికి వాంతులు, విరేచనాలు కావడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ వైజినాథ్ మూడో కుమార్తె భువనేశ్వరి మృతిచెందింది. అనంతరం ఆమె చెల్లెలు సంధ్య కూడా ప్రాణాలు కోల్పోయింది. తల్లితో పాటు మరో ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Follow for more updates
