శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత, హైడ్రామా నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు హాజరుకావాల్సిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసుల కళ్లుగప్పి పరారవ్వడం స్థానికంగా కలకలం రేపింది.

ఒకవైపు దువ్వాడ కోసం పోలీసులు గాలిస్తుంటే.. మరోవైపు “నా రాజా ఏమయ్యాడు? పోలీసులు ఏం చేశారు.” అంటూ దివ్వెల మాధురి టెక్కలిలోని దువ్వాడ నివాసం ముందు బైఠాయించి హల్ చల్ చేసింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను దూషించిన కేసులో.. వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత నెల 22న కొత్తూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన దువ్వాడను పోలీసులు గంటల తరబడి ప్రశ్నించారు. అప్పట్లో దివ్వెల మాధురితో సహా మరికొందరు రహదారిపై బైఠాయించి నిరసన తెలపడంతో కేసులు నమోదయ్యాయి. రెండోసారి విచారణకు రావాలని దువ్వాడకు కొత్తూరు సీఐ చింతాడ ప్రసాదరావు నోటీసులు అందించారు. వస్తానని ముందుస్తు సమాచారం ఇచ్చి, అప్పుడు కూడా పోలీసుల ఎదుట హాజరు కాలేదు. మధ్యాహ్నం 3 గంటల తరువాత దువ్వాడ తరఫు న్యాయవాది కొత్తూరు పోలీసుల వద్దకు చేరుకుని, అనారోగ్య కారణాలతో శ్రీనివాస్ విచారణకు హాజరుకాలేక పోతున్నారని, సమయం కావాలని కోరినట్లు తెలిసింది.
దీంతో దువ్వాడ ఇంటివద్ద ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. కొత్తూరు పోలీస్స్టేషన్కు బయలుదేరేముందు ఆయన మాట్లాడుతూ తనకు హృదయ సంబంధిత సమస్య ఉన్నట్లు ఇటీవల వైద్య పరీక్షల్లో తేలిందని, వైద్యులు మూడు వారాలు విశ్రాంతి తీసుకోమన్నారని చెప్పారు. అయినా చట్టంపై గౌరవంతోనే కొత్తూరు పీఎస్లో హాజరయ్యేందుకు వెళుతున్నానని అన్నారు. దువ్వాడతో మాధురి వెళ్లకుండా పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం కొత్తూరు పీఎస్కు బయలుదేరిన కొద్దిసేపటికే దువ్వాడ ఆచూకీ తెలియకుండా పోయింది. ఇక ఉదయం 11:50కి పీఎస్కు వెళుతున్నట్లు చెప్పి బయలుదేరిన శ్రీనివాస్ తెంబూరు రోడ్డులో వెళుతూ కొత్తపల్లి కూడలికి వచ్చే సరికి గన్మేన్, పీఏను వాహనం నుంచి దించేసి వెళ్లిపోయినట్లు పోలీసు విచారణలో తేలింది. అతడితో పాటు డ్రైవరు, మిగిలిన వ్యక్తులు ఫోన్లను స్విచ్ఛాఫ్ చేశారు.
Follow for more updates
