‘మోసపూరిత చర్యలు ఆపండి’: 25 శాతం సుంకాల హెచ్చరికల వేళ ట్రంప్కు ఖమేనీ గట్టి వార్నింగ్
“అమెరికా తన కుతంత్రాలను కట్టిపెట్టాలి. నమ్మకద్రోహులైన కిరాయి వ్యక్తుల సాయంతో ఇరాన్ను లొంగదీసుకోవాలనుకోవడం ఆ దేశ రాజకీయ వేత్తల పిచ్చితనం” అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు సవాల్ విసిరారు.
ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాల బాంబు వేసి, ఆర్థికంగా ఉరితీయాలని చూస్తున్న ట్రంప్కు ఖమేనీ ఏమాత్రం తగ్గకుండా ఈరకమైన కౌంటర్ ఇచ్చారు. ఇరాన్ ప్రజలు చైతన్య వంతులని, శత్రువుల జిత్తులమారి వేషాలు తమ దగ్గర సాగవని ఆయన ఘాటుగా స్పష్టం చేశారు.

Khamenei Warns Trump : మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి. ఇరాన్లో కొనసాగుతున్న నిరసనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలపై ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా తన మోసపూరిత చర్యలను, నమ్మక ద్రోహులైన కిరాయి వ్యక్తులపై ఆధార పడటాన్ని తక్షణమే నిలిపి వేయాలని ఆయన హెచ్చరించారు.
శత్రువుకు తలవంచం: ఖమేనీ
86 ఏళ్ల ఖమేనీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “మహా శక్తివంతమైన ఇరాన్ దేశం శత్రువుల ముందు తన సంకల్పాన్ని, ఉనికిని చాటుకుంది. అమెరికా రాజకీయ నాయకులు తమ కుట్రలను ఆపుకోవాలి. ఇరాన్ ప్రజలు చాలా చైతన్యవంతులు. వారికి శత్రువు ఎవరో తెలుసు. వారు ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటారు” అని పేర్కొన్నారు. 1979 నాటి విప్లవం తర్వాత ఇరాన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలుగా భావిస్తున్న ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 646 మంది మరణించినట్లు మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి.
నిరసనకారులను చంపితే రంగంలోకి దిగుతాం..
ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను చంపడాన్ని కొనసాగిస్తే అమెరికా సైన్యం రంగంలోకి దిగుతుందని ట్రంప్ ఇప్పటికే “లాక్డ్ అండ్ లోడెడ్” అంటూ హెచ్చరించారు. తక్కువ ప్రమాదం నుంచి అత్యంత తీవ్రమైన సైనిక చర్యల వరకు అన్ని ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. దీనికి తోడు ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వాణిజ్య రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇరాన్ను ఆర్థికంగా ఒంటరి చేయడమే లక్ష్యంగా ట్రంప్ ఈ ఆర్థిక అస్త్రాన్ని ప్రయోగించారు.
