కారణాలు ఏంటో తెలీదు.. ఈ మధ్యకాలం కారులో మంటలు ఎగిసిపడుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. అలాంటి ఘటన నుంచి చాలామంది బయటపడిన సందర్భాలు ఉన్నాయి. మంటలకు కారు నుంచి బయటకు రాలేక ఓ వ్యక్తి సజీవ దహనమైన ఘటన తాజాగా హైదరాబాద్లో వెలుగు చూసింది.
హైదరాబాద్లోని బౌరంపేట్ ప్రాంతంలో ఘోరం జరిగింది. ఏం జరిగిందో తెలీదుగానీ మంటల్లో ఓ కారు పూర్తిగా దగ్దమైంది. అందులో నుంచి బయటికి రాలేక ఓ వ్యక్తి అక్కడికక్కడే సజీవ దహనం అయ్యాడు. దుండిగల్ పీఎస్ పరిధిలోని బౌరంపేట్లోని వజ్ర బిల్డర్స్ వెనకున్న పిసరి వారి పొలం దగ్గర ఈ ఘోరం జరిగింది. కారులో ఒక్కసారిగా మంటలు అంటుకొని కొద్దిసేపటికే దగ్దమైంది. దీంతో కారులో ఉన్న వ్యక్తి బయటికి రాలేక అందులోనే ప్రాణాలు కోల్పోయాడు.
దీని గురించి స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. మృతుడు బౌరంపేట్లో నివాసం ఉండే కార్తీక్ రాధాకృష్ణగా గుర్తించారు. ప్రమాదవశాత్తు కారుకి నిప్పు అంటుకుందా? కావాలని ఈ విధంగా చేశారా? లేకుంటే దీని వెనుక ఏదైనా కోణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
