జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో 21స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలు గెల్చుకుని అసెంబ్లీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే . డిప్యూటీ సీఎం తో పాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్, అటవీ-పర్యావరణం,సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వశాఖల బాధ్యతలు అప్పగించారు. బాధ్యతల నిర్వహణలో పాలుపంచుకొనే అధికారులు కూడా చాలా అవసరం, అందుకోసం పవన్ కళ్యాణ్ కు ఓ అద్భుతమైన టీమ్ కావాలి. ప్రత్యేకించి పాలనలో ఆయన అనుకున్న లక్ష్యాలను నెరవేర్చటానికి సివిల్ సర్వెంట్స్ అధికారులుగా ఉండటం అవసరం. ఆ అధికారికి నీతి, నిజాయితీ , నిబద్ధత , పట్టుదల లాంటి ఎన్నో మంచి లక్షణాలుండాలి . సరిగ్గా అలాంటి అధికారే తగిలారు పవన్ కి …. ఎవరా అధికారి , పవన్ ను అంతగా ఎందుకు ఆయన ఆకర్షించారు?
ఎవరా పవర్ ఫుల్ కొదమ సింహం అంటే … ఆయన పేరే మైలవరపు కృష్ణతేజ. కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి. తెలుగు వ్యక్తి. ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్. ఎందుకు పవన్ కళ్యాణ్ ఏరికోరి కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారిని తన పేషీలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారనేది చాలా ఆసక్తికరం. కృష్ణతేజ తన ఏడేళ్ల కెరీర్ లో ఎన్ని ఘనతలు సాధించారో తెలుసుకోవటం చాలా అవసరం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ 2014 సివిల్స్ పరీక్షలో 66ర్యాంకు సాధించి విజేతగా నిలిచారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2017లో కేరళ క్యాడర్ లో అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్ గా నియమితులైన కృష్ణతేజ కెరీర్ లో అద్భుతమైన పేరు సంపాదించిపెట్టి, పవన్ కళ్యాణ్ లాంటి నాయకులను అంతలా ఆకర్షించిన ఘటనలు ఏంటో చూద్దాం.
2018లో వచ్చిన కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఆ వరదల ప్రభావం భయానకంగా పడిన జిల్లాల్లో అలెప్పీ ఒకటి. ఆ సమయంలో అలెప్పీ జిల్లాకు సబ్ కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజకు పూర్తి స్థాయి అధికారిగా అదే ఫస్ట్ పోస్టింగ్. రైస్ బౌల్ ఆఫ్ కేరళగా పిలుచుకునే కుట్టునాడు ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతాయనే ముందస్తు సమాచారం సబ్ కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజకు అందింది. కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రెండున్నర లక్షల మంది ప్రజలను 48గంటల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దేశంలోనే అతి సమర్థవంతమైన రెస్య్కూ ఆపరేషన్స్ లో ఒకటిగా ఆపరేషన్ కుట్టునాడు నిలిచింది.
వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితుల కోసం ఏమైనా చేయాలనే దిశగా కృష్ణతేజ ఆలోచనలను సాగించారు. ‘ఐయామ్ ఫర్ అలెప్పీ’ పేరుతో ఓ ఫేస్ బుక్ క్యాంపెయిన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఇంటర్నెట్ లో వైరల్ గా మారటంతో వేరే రాష్ట్రాల నుంచి అలెప్పీ కోసం సాయాన్ని అందించేందుకు ఎంతోమంది ముందుకు వచ్చారు. ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావు తన పత్రిక ద్వారా విరాళాలను సేకరించి అలెప్పీలో ఇళ్లను నిర్మించి బాధితులకు అందించాలనే ప్రాజెక్టును చేపట్టారు. ఆ బాధ్యతలను కృష్ణతేజకే రామోజీరావు అప్పగించారు. బాహుబలి టీమ్ ద్వారా రాజమౌళి, యాంకర్ సుమ ఇలా ఎంతో మంది అలెప్పీలో బాధితుల కోసం తరలివచ్చేలా కృష్ణతేజ మాట్లాడి ఒప్పించగలిగారు. ఐయామ్ ఫర్ అలెప్పీ ఫేస్ బుక్ సాధించిన విప్లవం అంతా ఇంతా కాదు. యునిసెఫ్ లాంటి సంస్థల దృష్టిని ఆకర్షించి వాళ్లే పేజ్ ను మెయింటైన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. 2019లో కేరళవాసులు అక్కున చేర్చుకున్న అల్లు అర్జున్ ను, ఆ తర్వాత ఏడాది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ను బోట్ రేస్ కి అతిథులుగా పిలిచి పర్యాటకులను అలెప్పీ వైపు ఆకర్షించేలా కృష్ణతేజ చేయగలిగారు.
Discussion about this post