ఏ పని చేపట్టినా అది సంపూర్ణమైతేనే సార్థకత… మధ్యలో నిలిచిపోతే చేపట్టి కూడా ప్రయోజనం ఉండదు… సరిగ్గా ఆ కోవలోకే వస్తుంది పర్కాలలో నిర్మించతల పెట్టిన వంద పడకల ఆసుపత్రి భవనం. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్కాల పట్టణంలో కోట్లాది రూపాయల వ్యయంతో మొదలు పెట్టిన ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణ పనులు అర్థాంతరంగా నిలిచి పోయాయి… దీంతో అనుకున్న ప్రయోజనం నెరవేరడం లేదు… అర్థాంతరంగా నిలిచి పోయిన పర్కాల వంద పడకల ఆసుపత్రి భవనంపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం…
దిన దినాభివృద్ది చెందుతున్న హన్మకొండ జిల్లా పర్కాల పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మించాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి స్థానిక పర్కాల శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి చొరవతో నాటి కేసీఆర్ ప్రభుత్వం పర్కాలలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి అంగీకరించి… ఆ మేరకు 39కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. దీంతో 2022లో వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు కూడా చేపట్టి భవనాలను నిర్మించారు. అయితే ఇంతలో రాష్ట్రంలో ప్రభుత్వం మారంది. మారిన ప్రభుత్వంతో పాటే పర్కాలలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు కూడా నిలిచి పోయాయి.
ఏనాడో నిర్మించిన పాత ఆసుపత్రిలో ప్రస్తుత అససరాలకు తగ్గట్లు మెరుగైన సదుపాయాలు లేవు. ఒకప్పటి జనాభాతో పోలిస్తే… కొంత కాలంగా పర్కాల పట్టణ జనాభా బాగా పెరిగింది. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తే భవిష్యత్తులో పర్కాల పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల వారికి కూడా అనువుగా ఉంటుందని భావించారు. అందులో భాగంగా పనులకు శ్రీకారం చుట్టారు. నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు స్థానికులు… తమకు పెద్దాసుపత్రి రాబోతుందని సంతోషించారు. అయితే నిర్మాణ పనులు అర్థాంతరంగా నిలిచిపోవడంతో వారి సంతోషానికి బ్రేక్ పడినట్లయింది.
ప్రభుత్వం మారడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా కొత్తవారు ఎన్నికయ్యారు. నాటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఓడిపోయి కొత్తగా రేవూరి ప్రకాష్ రెడ్డి పర్కాల ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నాటి ప్రభుత్వ హయాంలో పర్కాలలో వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణం కోసం కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టరుకు ప్రభుత్వం నుంచి అప్పటికే పూర్తి చేసిన పనులకు బిల్లులు మంజూరు కావడం లేదు. ఫలితంగా సదరు కాంట్రాక్టరు పనుల్ని నిలిపి వేశాడు. ఇక ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని రోజులకే లోక్ సభ ఎన్నికలు రావడం… రాష్ట్రంలో పూర్తిగా రాజకీయ వాతావరణమే నెలకొనడంతో ఈ పనుల గురించి పట్టించుకున్న వారే లేకుండా పోయారు.
ఆసుపత్రి భవన నిర్మాణ పనులు మధ్యలో నిలిచి పోవడంతో అసంపూర్తిగా మిగిలిన భవనం ప్రస్తుతం అసాంఘిక శక్తులకు కేంద్రంగా మారింది. కొంత మంది ఆకతాయిలు అసంపూర్తిగా నిలిచి పోయిన భవనాన్ని తమ కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్నారు. రాత్రి పూట వారికి ఇదో అసాంఘిక కేంద్రంగా తయారవుతోంది. భనవంలో చాలా చోట్ల మద్యం తాగి అక్కడే పడేసిన బీరు బాటిళ్లు… ఇతర ఆనవాళ్లు కనిపిస్తాయి. పరిస్థితి ఎంత అద్వాన్నంగా మారిందంటే… అక్కడే నైట్ వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి స్థానికంగా జరుగుతున్న అసాంఘిక కార్యకాలపాల గురించి పక్కనే ఉన్న పోలీసు స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి భవనంలో యదేశ్చగా అసాంఘిక కార్యకలాపాలు సాగుతుంటే పట్టించుకున్న అధికారి లేరని స్థానికులు విమర్శిస్తున్నారు.
అర్థాంతరంగా నిలిచిపోయిన వంద పడకల ఆసుపత్రి భవనం విషయంలో రాజకీయ విమర్శలు కూడా చేసుకున్నారు నాయకులు. ఈ ఆసుపత్రి భవనాన్ని మంజూరు చేయించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి… ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి ఈ విషయమై రాజకీయ సవాల్ కూడా చేశారు. ప్రభుత్వం నుంచి వెంటనే నిధులు మంజూరు చేయించి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా 39కోట్ల రూపాయలతో చేపట్టిన ఆసుపత్రి నిర్మాణం అర్థాంతరంగా నిలిచిపోవడంతో ప్రజలకు సకాలంలో వైద్య సదుపాయాలు సమకూరే పరిస్థితి కనిపించడం లేదు. అదే విధంగా నిర్మాణ పనులు మరింత కాలం జాప్యమయితే… వ్యయం పెరిగి ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడే ప్రమాదం ఉంది. కాబట్టి వైద్యాధికారులు, స్థానిక ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మంత్రులు చొరవ తీసుకొని ఆసుపత్రి భవనాన్ని వెంటనే పూర్తి చేసి కొత్త భవనంలో వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకు రావాలని పర్కాల పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Discussion about this post