పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న సామెత ఆ మున్సిపాలిటీకి సరిగ్గా సరిపోతుంది. అది పేరుకే మునిసిపాలిటీ… కానీ ఏ మూలన చూసినా సమస్యలు వెక్కిరిస్తూనే ఉంటాయి. పాలకవర్గం ఏర్పాటై మూడేళ్లు గడుస్తున్నా అక్కడ మౌలిక సదుపాయాలు ఇప్పటికీ మెరుగు పడలేదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మునిసిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫోర్ సైడ్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం…
ఇప్పుడు మీరు చూస్తున్నది ఉమ్మడి శ్రీకాకులం జిల్లా పాలకొండ నగర పంచాయితీ కార్యాలయం. కార్యాలయం ముందు చూడండి ఏమి కనిపిస్తున్నాయో. చిరు వ్యాపారులు పళ్లు, కూరగాయలు అమ్ముకుంటున్నారు. సరే ఆ వ్యాపారస్తుల విషయం పక్కనబెట్టి పారిశుధ్య పరంగా నగర పంచాయితీ కార్యాలయం చూడ్డానికైతే కాస్తా… కూస్తో శుభ్రంగానే కనిపిస్తుంది. మరి ఈ కార్యాలయం వద్ద ఉన్నట్లుగానే ఊరంతా శుభ్రంగా ఉందా? ఆ విషయం తెలుసుకోవడానిక ఓ సారి ఊరంతా తిరిగొద్దాం పదండి.
ఇది చూడండి… రోడ్డు పక్కన మురుగునీటి కాలువ. దాన్ని శుభ్రం చేయక ఎన్ని రోజులైంది? అని అడగడం కంటే… అసలు ఒక్కసారైనా మురుగునీటి కాలువలో పూడిక తీశారా? అంటే బాగుంటుంది. పందులకు ఆశ్రయంగా మారిన మురుగునీటి కాలువ పరిస్థితి… పాలక వర్గం పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇక ఈ పశువులు రోడ్డు పక్కన వేసే చెత్తను మేస్తూనే ఉంటున్నాయంటే… ఎంతగా చెత్త పేరుకు పోతుందో వేరే చెప్పనక్కర లేదు. ఓ వైపు మురికి కాలువల్లో పందులు… మరోవైపు రోడ్డు పక్కన పేరుకుపోతున్న చెత్తకుప్పలు… క్లుప్తంగా ఇక్కడి పారిశుధ్య సమస్యకు అద్దం పడుతున్నాయి.
అసలే వానాకాలం… వాతావరణం మారినప్పుడు సహజంగానే సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. మరి పరిశుభ్రత పాటించక పోతే పరిస్థితి మరింత జటిలంగా తయారవుతుంది. ఇప్పుడు కాలకొండ నగర పంచాయితీ పరిధిలోని పారిశుధ్య సమస్య కూడా ప్రజలకు రోగాలు వ్యాప్తి చేసేదిగానే తయారయింది. 30వేలకు పైగా జనాభా కలిగిన పాలకొండ మునిసిపాలిటీలో పారిశుధ్య పనులు పడకేశాయి. పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజలకు వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు తప్పేలా లేవు.
ఈ పారిశుధ్య సమస్య ఒక్క ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు. మునిపాలిటీ పరిధిలోని దాదాపు అన్ని చోట్ల అదే దుస్థితి కనిపిస్తుంది. ఎక్కడ మురుగునీటి కాలువ చూసినా కాలువ నిండా పేరుకు పోయిన ప్లాస్లిక్ కవర్లు, ఇతర చెత్తతోనే నిండి ఉంటాయి. చివరకు ప్రధాన మార్గంలోనూ, బస్టాపు ఎదురుగానూ అపరిశుభ్ర వాతావరణమే నెలకొని ఉంది. ఇలాంటి అపరిశుభ్ర పరిస్థితిపై పాలకొండ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పాలకవర్గం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వానాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పాలకొండను గ్రామ పంచాయితీ నుంచి మునిసిపాలిటీగా మార్చితే ఏదో అభివృద్ది జరుగుతుందని భావించారు ప్రజలు. అయితే ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంలోనే అభివృది జరిగిందని స్థానికులు వాపోతున్నారు. నివాస ప్రాంతాల్లో మురుగునీటి కాలువలు, పేరుకు పోయిన చెత్తతో పారిశుధ్య సమస్య నెలకొనగా… మంచినీటి సమస్య కూడా ఇక్కడి ప్రజల్ని వేధిస్తోంది . పాలకొండ ప్రజలను వేధిస్తున్న మరో సమస్య డంపింగ్ యార్డు. ఊరికి సమీపంలోనే డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడంతో ప్రజలు దుర్గ౦ధం భరించ లేక అసౌకర్యానికి గురవుతున్నారు. స్థానికుల నుంచి వచ్చిన ప్రతిఘటనతో తాత్కాలికంగా అక్కడ చెత్త వేయడం నిలిపి వేశారు. కానీ శాశ్వతంగా డంపింగ్ యార్డును నివాస ప్రాంతానికి దూరంగా తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
పాలకొండ మునిసిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఫోర్ సైడ్స్ టీవీ మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లింది. అక్కడి సమస్యలపై ఫోర్ సైడ్స్ టీవీతో మాట్లాడిన పాలకొండ మునిసిపల్ కమిషనర్ విశ్వేశ్వరరావు… సాధ్యమైనంత మేర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా ఇతర సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు రాగానే సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానన్నారు.
ఇదీ ఉమ్మడి శ్రీకాకులం జిల్లాలో కొత్తగా ఏర్పాటయిన పాలకొండ నగర పంచాయితీ పరిధిలో పారిశుధ్య సమస్యతో ప్రజలు పడుతున్న ఇబ్బంది. మరి అధికారులు చెబుతున్న ప్రకారం ప్రభుత్వం నుంచి ఎప్పటిలోగా నిధులు వస్తాయో… ప్రజల సమస్యలు ఎప్పటిలోగా పరిష్కారం అవుతాయో చూడాలి.
Discussion about this post