భారత జాతీయోద్యమ చరిత్రలో అత్యంత పాశవిక, హృదయవిదారక సంఘటనగా జలియన్ వాలాబాగ్ దురాగతం నిలిచిపోయింది. నాటి బ్రిటీష్ పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయక ప్రజానీకం నేలకొరిగారు. అమృత్సర్ లోని స్వర్ణదేవాలయం పక్కన ఉన్న ఓ తోట పేరు జలియన్ వాలాబాగ్. పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖీ పండగ అంటే కొత్తసంవత్సరం సందర్భంగా వేలాది మంది అక్కడకు చేరుకున్నారు. అదే చోట బ్రిటీషువారి రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జాతీయ నాయకులు సమావేశం అయ్యారు. ఇది తెలిసిన జనరల్ డయ్యర్ మారణహోమం సృష్టించారు. ఆ రక్త చరిత్రపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
రౌలత్ చట్టంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇందులో భాగంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యపాల్ వంటి నేతలను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించారు. దీనిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు నిర్వహించారు. జలియన్ వాలాబాగ్లోనూ వారి అరెస్టులను ఖండిస్తూ సంఘీభావం తెలియజేశారు. వివిధ విభాగాలకు చెందిన 90 మంది సైనికులు ఇండియన్ ఆర్మీ, వారితో బాటు రెండు ఆయుధాల వాహనాలు అక్కడికి వచ్చాయి. ఇరుకైన సందుల కారణంగా వాహనాలు బాగ్ లోపలికి రాలేకపోయాయి. జలియన్ వాలా బాగ్ పార్కు పెద్దపెద్ద ఇళ్లు, పెద్ద భవనాల మధ్య ఉంది. ఉన్న కొద్దిపాటి ఇరుకైన సందుల దారుల్లో చాలా వాటికి తాళాలు వేసిఉన్నాయి.
జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన మహిళలు,పురుషులు, పిల్లలపైన 1919 ఏప్రిల్ 13న బ్రిటీష్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు 10 నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. ప్రజలను అణగదొక్కే ప్రయత్నంలో బ్రిటీషు ప్రభుత్వం రౌలత్ చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే పోలీసులకు విపరీతమైన అధికారాలు కట్టబెట్టడం.. దీనికి కారణం అప్పటికే జాతీయ ఉద్యమం ఊపందుకోవడమే..
జలియన్వాలాబాగ్ ఉదంతానికి ముందు రోజే జనరల్ రెజినాల్డ్ డయ్యర్ జలంధర్ నుంచి అమృతసర్కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. అతడు వచ్చీరావడంతోనే బహిరంగ ప్రదేశాల్లో జనం గుమిగూడటంపై ఆంక్షలు విధించాడు. వైశాఖి పండుగ వేడుకలు చేసుకునేందుకు దాదాపు 20 వేల మంది సిక్కులు, హిందూ, ముస్లింలు జలియన్ వాలాబాగ్ ప్రాంతంలో సమావేశమయ్యారు. దాదాపు ఏడెకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోట చుట్టూ ఎత్తైన గోడ, అక్కడక్కడ చిన్నచిన్న ద్వారాలు ఉన్నాయి. ప్రవేశ మార్గాలను మూసివేసి, గుమిగూడిన జనంపై గుళ్లవర్షం కురిపించారు. నాటి పాలకుల అధికారిక లెక్కల ప్రకారం 379 మంది ఈ కాల్పుల్లో మరణించారు.
కానీ ఈ ఘటనలో 1000కి పైగా చనిపోగా.. 2000 మందికి పైగా గాయపడ్డారు. ఈ హఠత్పారిణామానికి నిశ్చేష్ఠులైన ప్రజలు బయటకు వెళ్లడానికి వీల్లేని పరిస్థితుల్లో నెత్తురోడుతున్నా పార్కు గోడలపైకి ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. కొందరు అక్కడే ఉన్న నూతిలోకి దూకి ప్రాణాలను పోగొట్టుకున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది చాలదన్నట్లు డయ్యర్ జన సంచారంపై సంపూర్ణ నిషేధం విధించి, మృతదేహాల తరలింపును అడ్డుకోవడమేగాక చివరకు గాయపడినవారికి చికిత్స కూడా అందకుండా చేయడంతో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదంతం చరిత్రలో ఓ విషాద దినంగా, చీకటి రోజుగా మిగిలిపోయింది.
ఈ ఉదంతంపై విచారణ జరపడానికి 1919లో “హంటర్ కమిషన్” ఏర్పరచారు. ఆ కమిషన్ సమక్షంలో డయ్యర్ – ఆ మీటింగ్ గురించి 12:40కి తెలిసిందనీ, దానిని నిలపడానికి తానేవిధమైన ప్రయత్నమూ చేయలేదనీ, అక్కడ సమావేశమైన గుంపు గనుక కనిపిస్తే కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్ళాననీ చెప్పాడు. అయితే కాల్పులు జరపకుండా గుంపును చెదరగొట్టడం సాధ్యం అవుతుందని భావించినప్పటికీ, తర్వాత వారంతా అవహేళన చేసేవారని డయ్యర్ కమిషన్ కు చెప్పారు. ఆ స్థలంలోనికి వాహనాలు వెళ్ళగలిగితే గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాడినని, కాని ఇరుకైన సందులలోకి సాయుధ వాహనాలు వెళ్ళడం కుదరలేదని చెప్పాడు. జనం చెల్లా చెదురైనా గాని కాల్పులు ఆపలేదని, జనం అంతా వెళ్ళిపోయేదాకా కాల్పులు జరపడం తన బాధ్యత అని చెప్పాడు.
గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించడం తన బాధ్యత కాదు గనుక అలాంటి ప్రయత్నమేమీ చేయలేదని, ఆసుపత్రులు తెరచి ఉన్నందున వారే వెళ్ళవచ్చునని కూడా అన్నాడు. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 379 మంది 337 పురుషులు, 41 మంది బాలురు, 6 వారాల పసికందు మరణించగా.. 200 మంది గాయపడ్డారు. అక్కడ స్మారక చిహ్నంపైన రాసిన సమాచారం ప్రకారం అక్కడి బావిలోంచి 120 శవాలను బయటకు తీశారు. అయితే అధికారిక గణాంకాలు సరికాదని వాదనలున్నాయి. నగరంలో కర్ఫ్యూ ఉన్నందున గాయపడినవారని ఆసుపత్రులకు తీసికొని వెళ్ళడం సాధ్యం కాలేదని నివేదికలో తెలిపారు.
ఈ దురంతానికి ప్రతిగా దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్ లో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920 లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్, బ్రిటీష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదును ఇంగ్లండు ప్రభువుకు తిరిగి ఇచ్చివేశాడు. మొత్తమ్మీద ఈ సంఘటన స్వాతంత్ర్యోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని చెప్పవచ్చు.
1920లో హంటర్ కమిషన్ రిపోర్టు వెలువడింది. డయ్యర్ను డిమోషన్ అంటే కింది స్థాయికి మార్చారు. అతని ఆరోగ్యం కూడా క్షీణించి ఉండడం వలన తరువాత అతనిని వైద్య సదుపాయాలున్న ఓడలో ఇంగ్లాండుకు పంపేశారు. కొద్దిమంది బ్రిటిష్ అధికారులు మరొక భారత సైనిక తిరుగుబాటును అణచివేసినందుకు అతనిని ప్రశంసించారు. బ్రిటిష్ పార్లమెంటులో అతని చర్యను నిరసిస్తూ తీర్మానాలు చేశారు. ఇది చాలా దారుణమైన, అసాధారణమైన చర్య అని బ్రిటన్ ప్రధాని చర్చిల్ అభివర్ణించాడు. 1920లో డయ్యర్ పదవికి రాజీనామా చేశాడు.
1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించడానికి భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానించింది. 1923లో ఇందుకు కావలసిన స్థలం కొనుగోలు చేశారు. అమెరికాకు చెందిన బెంజమిన్ పోల్క్ అనే ఆర్కిటెక్టు స్మారక స్తూపానికి రూపకల్పన చేశాడు. 1961 ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్తూపం ఆవిష్కరించారు. నిరంతరాయంగా మండుతూ ఉండే అఖండ జ్వాలను తరువాత జోడించారు. ప్రక్కనున్న భవనాలపై బుల్లెట్ గుర్తులను ఇప్పటికీ చూడవచ్చును. బులెట్ల నుండి తప్పించుకోవడానికి జరిగిన తొక్కిసలాటలో అనేకులు దూకి మరణించిన భావి కూడా ఇప్పుడు ఒక స్మారక చిహ్నం.
ఆ దుర్ఘటనలో మరణించినవారికి బ్రిటీషు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. వారి హోదా, పనులను బట్టి నష్టపరిహారం ఇచ్చింది. అయితే అది కొంతమందికి మాత్రమే అందింది. చాలా మందికి అందలేదు. 1982లో రిచర్డ్ అటెన్బరో నిర్మించిన సినిమా “గాంధీ”లో “రంగ్ దే బసంతి”, “ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్” సినిమాలలో కూడా దుర్ఘటనను చూపారు.1920లో హంటర్ కమిషన్ నివేదిక మాత్రం డయ్యర్ను, అప్పటి పంజాబ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. డయ్యర్ భారత్ విడిచి వెళ్లిపోయినా అతడ్ని దేశభక్తులు వదిలిపెట్టలేదు. మృత్యువులా వెంటాడి, వేటాడి మట్టుబెట్టారు. ఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఉద్దమ్సింగ్ అనే దేశభక్తుడు లండన్ వెళ్లి మరీ 1940 మార్చి 13న డయ్యర్ను హతమార్చి జలియన్ వాలాబాగ్ మారణహోమానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
Discussion about this post