విద్యా శాఖకు మంత్రి లేడన్న వెదవెవ్వడు… ఆ శాఖకు నేనే మంత్రిని… నేను ఫామ్ హౌస్ లో పడ్డుకునే వాన్ని కాదు… పక్కగా పని చేసే వాన్ని అని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మీడియా సమావేశంలో ప్రకటించారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న విద్యా శాఖ… అందులోనూ ఆయన సొంత జిల్లాలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితంగా దొరకాల్సిన పాఠ్య పుస్తకలు పాత ఇనుప సామాన్లు విక్రయించే షాసులో అంగడి సరుకయ్యాయి.
ఇప్పటికే సర్కారు విద్యకు చాలా మంది దూరమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై, అక్కడి బోధనపై నమ్మకం సన్నగిల్లిన ప్రజలు చాలా మంది ఆర్థికంగా స్థోమత లేప్పటికీ… తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకే పంపిస్తున్నారు. ఆ క్రమంలో అప్పులు చేస్తున్నవారు కొందరైతే… ఆస్తులు అమ్ముకుంటున్న వారు మరికొందరు. కాయా కష్టం చేసే దినసరి కూలీలు కూడా ఇటీవలి కాలంలో ప్రైవేటు వైపే మొగ్గు చూపుతున్నారు. ఆ మాత్రం కూడా ఆర్థిక స్థోమత లేని పేదలు తమ పిల్లల్ని ప్రభుత్వ బడులకు పంపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, పెన్నులు, దుస్తులు, అన్నీ ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తుంది. మద్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తుంది. పేదలు ఆ విధంగానైనా ప్రభుత్వ బడుల్లో చదువుకుంటారనేది ప్రభుత్వ ఆలోచన.
ప్రభుత్వ ఆలోచన ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ… వాటిని అమలు చేయాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తే ఆశించిన ఫలితాలు రావు. ఆ తరహాలోనే మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన పాఠ్య పుస్తకాలు ఇటీవల ఒక పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేసే షాపుల్లో పెద్ద మొత్తంలో లభ్యం కావడం చర్చకు దారి తీస్తుంది. భారీ సంఖ్యలో నిల్వ ఉంచిన ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను స్క్రాప్ దుకాణంలో కనుగొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో
సమస్యలపై ఏబీవీపీ నిరశన చేపట్టిన రోజున అచ్చంపేట పట్టణంలోని స్క్రాప్ దుకాణంలో నిల్వ ఉంచిన పాఠ్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బందే స్క్రాప్ కింద విక్రియించినట్లు వాటికి కొనుగోలు చేసిన పాత ఇనుప సామాను షాపు నిర్వాహకుడు స్పష్టం చేశాడు. అవి పాత పుస్తకాలనుకొని కొన్నట్లు తెలిపారు. ఆరు వేల రూపాయలకు వాటికి కొన్నట్లు ధరతో సహా వివరించారు. అయితే ప్రభుత్వ అధికారులు జిల్లాలో ఏమీ జరుగలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. స్క్రాప్ దుకాణంలో పాత పుస్తకాలని చెప్పి విక్రయించిన ప్రభుత్వ ఉపాద్యాయుల వ్యవహారాన్ని ఫోర్ సైడ్స్ టీవీ బట్టబయలు చేసింది. ఇవి పట్టుకుంటే గానీ దొరికిన పాఠ్య పుస్తకాలు… ఇక బయటికి రాకుండా పక్కదారి పడుతున్న పుస్తకాలు మరిన్ని ఉంటాయి.
స్క్రాప్ దుకాణంలో పట్టుకున్న ప్రభుత్వ పాఠ్య పుస్తకాల అంశం మరువక ముందే మరో చోట దాచి ఉంచిన పాఠ్య పుస్తకాలు వివాదానికి కారణమయ్యాయి. పాఠశాలలో ఉండాల్సిన పుస్తకాలు… ఒక ఇంట్లో నిల్వ ఉంచారు. దానర్థం.. అక్కడి నుంచి బయటికి తరలుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, ఫోర్ సైడ్స్ టీవీ అక్కడ జరుగుతున్న విషయాన్ని విద్యా శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, విద్యా శాఖ అధికారులు వచ్చి సమగ్రంగా విచారించిన తర్వాత పాఠ్య పుస్తకాలు అక్రమ పద్దతిలో ఓ ఇంటిలో ఉన్న విషయం నిర్థారణ చేసుకొని ఇంటిని సీజ్ చేశారు.
ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు అచ్చంపేటలో ఒక గోదాములో బయట పడటం, అదే విధంగా మరో చోట ఒక ఇంటిని అధికారులు సీజ్ చేయడం జిల్లాలో చర్చగా మారింది. సీఎం సొంత జిల్లా… అందులోనూ విద్యా శాఖ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చూస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన చోటే విద్యా శాఖాధికారులు పాఠ్య పుస్తకాలను అమ్మకుంటూ చదువులను పక్కదారి పట్టిస్తున్నారంటే… ఇక ఇతర జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. మరి ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సీఎం రేవంత్ రెడ్డి భయం కూడా జిల్లాలో విద్యా శాఖ అధికారులకు ఎందుకు లేకుండా పోయింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదీ మహబూబ్ నగర్ జిల్లాలో పాఠ్య పుస్తకాలు పక్కదారి పడుతున్న తీరు. మరి అధికారులు ఇప్పటికైనా కల్లు తెరుస్తారా? లేక ఆ పాపంలో పాలు పంచుకుంటారా? చూడాలి.
Discussion about this post