కొన్ని సినిమాలు.. కొన్ని పాత్రలు కొందరి కోసమే పుడతాయి. ఆయా పాత్రల్లో నటించాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా… చేరాల్సిన వారికే అది చేరుతుంది. ఆ పాత్రే విప్లవ వీరుడు.. అల్లూరి సీతారామరాజు. ఇతర అగ్ర నటులను దాటుకొని చివరకు కృష్ణను వరించింది. టాలీవుడ్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ సినిమా నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం..
తేనె మనసులు చిత్రంతో చలనచిత్ర రంగప్రవేశం చేసి, అడ్వెంచర్ చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించిన కృష్ణ నటించిన 12వ చిత్రం అసాధ్యుడు. ఈ సినిమాలోని ఓ అంతర్నాటకంలో కృష్ణ అల్లూరి సీతారామరాజుగా నటించినప్పుడు, ఆ విప్లవ వీరుడి ఇతివృత్తాన్ని సినిమాగా మలచాలన్న ఆకాంక్షకు తొలి బీజం పడింది. అంతకుముందు జగ్గయ్య కూడా ఆలు-మగలు సినిమాలోని ఒక అంతర్నాటకంలో సీతారామరాజుగా నటించారు. అది కూడా కృష్ణకు స్ఫూర్తే! అక్కినేని నాగేశ్వరరావుతో ఈ సినిమా తీయాలని తాతినేని ప్రకాశరావు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ, ఎందుకో తీయలేకపోయారు. ఇదే ఆలోచన ఎన్టీఆర్కీ వచ్చింది. ప్రముఖ నాటక రచయిత పడాల రామారావుతో స్క్రిప్టు కూడా తయారుచేయించారు. ఆ ప్రయత్నమూ ఫలించలేదు. దేవదాసు నిర్మాత డి.ఎల్. శోభన్బాబుతో ఈ సినిమా తీయాలని భావించినా, అదీ కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలోనే త్రిపురనేని మహారథితో స్క్రిప్టు రూపొందించి చిత్ర నిర్మాణానికి నడుం బిగించారు కృష్ణ. మహారథి అప్పట్లో చాలా బిజీ రచయిత. కేవలం ఈ చిత్రం కోసం ఆయన అంతకుముందు అంగీకరించిన సినిమాలను కూడా రద్దు చేసుకొని, ఆ ఆదర్శయోధుడి వీర చరిత్ర గురించి అనేక పరిశోధనల అనంతరం కథ తయారుచేశారు.
1973 డిసెంబరు 12న అల్లూరి సీతారామరాజు చిత్రీకరణ ప్రారంభమైంది. పద్మాలయా సంస్థకు ఆస్థాన ఛాయాగ్రాహకుడైన వి.ఎస్.ఆర్.స్వామి.. సినిమా స్కోప్లో చిత్రాన్ని రూపొందిస్తే అద్భుతంగా ఉంటుందని సలహా ఇచ్చారు. సాహసానికి మారుపేరైన కృష్ణ వెంటనే ముంబయి నుంచి సంబంధిత లెన్సులు తెప్పించారు. నాగరిక ప్రపంచానికి నలభై మైళ్ల దూరంలో కొండలు, కోనల మధ్య చింతపల్లిలో గృహవసతితో సహా యూనిట్ మొత్తానికి సకల సౌకర్యాలను కళా దర్శకుడు రామలింగేశ్వరరావు కల్పించారు. చింతపల్లికి దగ్గరలో ఉన్న లోతుగడ్డ, సప్పర్ల, లంబసింగి, పోశనపాడు, అన్నవరం, కృష్ణదేవిపేట, బలిమెల మన్యం ప్రాంతాల్లో శీతాకాలంలో నిర్విరామంగా దాదాపు రెండు నెలలపాటు షూటింగ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో మంచినీళ్లకు కూడా చాలా దూరం వెళ్లాల్సివచ్చేది. బస్సులు, మినీ ట్రక్కులు, కార్లు, క్రేన్లు ఒకటేమిటి.. అన్నీ మన్యంలోకే వచ్చేశాయి. నటీనటులతో పాటు సాంకేతిక సిబ్బందీ ఒక అనిర్వచనీయమైన భావావేశంతో చిత్ర నిర్మాణాన్ని జయప్రదం చేశారు. తొలి ప్రయత్నంలోనే షాట్ ఒకే అయ్యేది. ఇది ఒక చిత్రమైన అనుభూతిగా ఉండేదని గంటందొరగా నటించిన గుమ్మడి ఒకానొక సందర్భంలో పంచుకున్నారు. సెట్స్లోనే మహారథి సంభాషణలు రాసేవారు. మన్యంలో షూటింగ్ జరిగినన్ని రోజులు మహారథి ఒకపూట మాత్రమే భోజనం చేసేవారు. పతాక సన్నివేశానికి అవసరమైన సంభాషణలు రాసేందుకు ఒకరోజు మహారథి యూనిట్ సభ్యులకి దూరంగా వెళ్లి సాయంకాలం వరకు రాలేదు. సీతారామరాజే తనని ఆవహించి అద్భుతమైన డైలాగులు రాయించాడని మహారథి చెబుతుండేవారు. అంతవరకూ కృష్ణ నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే, అల్లూరి సీతారామరాజు మరో ఎత్తు. సంభాషణలు పలికే తీరు, హావభావాలు ప్రదర్శించే విధానం, ఆహార్యం వంటి విషయాల్లో కృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏకబిగిన 30 కాల్షీట్లు పని చేశారు.
Discussion about this post