సూది కొండ … పలకడానికి ఈ పేరు చిన్నదే అయినా ఇవాళ పలాస రాజకీయాలు దీని చుట్టూనే తిరుగుతున్నాయి. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి మధ్యన ఉండే ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నది మీరు అంటే మీరు అని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు వైసిపి టిడిపి నేతలు. సూది కొండ పై ఆధిపత్య పోరుకు సిద్ధపడుతున్న అధికార,విపక్ష పార్టీల వార్ పై… 4 సైడ్ న్యూస్ ప్రత్యేక కథనం….
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాల్టీ లో అత్యంత ఖరీదైన ప్రాంతం సూదికొండ. పట్టణానికి కొంచెం దూరంగా ఉండటం .. సమీపం లో కొండలు గుట్టలు ఉండటం తో దీనికి సూధికొండగా పేరు వచ్చింది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీగా మారడంతో ఈ ప్రాంతం మున్సిపాల్టీలో కలిసింది. అప్పటి నుండి ఈ ప్రాంతానికి మంచి గిరాకీ ఏర్పడింది.
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీగా మారిన తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరు లేరని విమర్శలు వస్తున్నాయి. గతం లో టిడిపి ప్రభుత్వం లో గాని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లో గానిసూదికొండను పట్టించుకునేవారు లేరనే విమర్శలు ఉన్నాయి. ఈ ప్రాంతం లో ఇప్పటికీ త్రాగునీరు, రోడ్లు, కాలువలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి అప్పలరాజు ఈ ప్రాంతానికి చెందిన వాడైనప్పటికి అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని ప్రజలు బహిరంగం గానే విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం సూదికొండ రాజకీయ పార్టీలకు ప్రచార అస్త్రం గా మారింది. ఈ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకునే అధికార పార్టీకి చెందిన మున్సిపల్ సీనియర్ కౌన్సిలర్ ఇటీవల పార్టీకి రాజీనామా చేసి టిడిపి లో కలిసి పోయిన ఘటన రాజకీయ పార్టీలో కాకరేపింది. సూదికొండ లో ఉన్న మైన్స్ తో పాటు కోట్ల రూపాయలు విలువచేసే స్థలాలను మంత్రి కాజేసి తన అనుయాయులకు కట్టబెట్టారని టిడిపి బహిరంగం గానే ఆరోపిస్తోంది. మంత్రి గా ఉండి కూడా ఐదేళ్ల లో సూదికొండ ను అభివృద్ధి చేయలేక చేతులెత్తేసారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ఈ ప్రాంతం లో ఎన్నికల ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న టిడిపి నేతలు మరో సారి మంత్రికి అధికారం అప్పగిస్తే సూది కొండ ను మిగల్చరని ఎంపీ రామ్మోహన్ నాయుడు.. ఎంఎల్ఏ అభ్యర్థి శిరీష వ్యాఖ్యానించారు.
Discussion about this post