లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోల వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో మనుగడ కోసం పోరాడుతున్న జేడీఎస్ ప్రతిష్ఠను ఈ వీడియోల వ్యవహారం దెబ్బతీస్తోంది. మరోవైపు ఆ పార్టీతో పొత్తులో ఉన్నబీజేపీకి ఇది ఇబ్బందికరం గా మారింది. దీంతో ఆ పార్టీ ఈ వ్యవహారానికి అంటీ ముట్టనట్టు ఉంటోంది. మరోవైపు ఈ అంశం కూటమిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని ఇరు పార్టీల నేతలు ఆందోళన పడుతున్నారు. ఇంతకీ ఎవరీ ఎంపీ ప్రజ్వల్ ? ఏమిటి ఆయన కథ ? ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం.
ఎంపీ ప్రజ్వల్మాజీ ప్రధాని దేవెగౌడ కి స్వయంగా మనవడు. దేవెగౌడ పెద్దకుమారుడైన రేవణ్ణ కుమారుడు.. హసన్ లోకసభ స్థానం నుంచి 2019 లో గెలిచాడు ..ప్రస్తుత ఎన్నికల్లో కూడా పోటీలో ఉన్నారు. కొద్దీ రోజుల క్రితమే హసన్ లో పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగియగానే వీడియోల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన 3000 అశ్లీల వీడియోల వ్యవహారం పెనుసంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోల్లో వందలాది మంది సాధారణ మహిళలతోపాటు.. పలువురు ప్రభుత్వ ఉద్యోగినులు కూడా ఉన్నట్టు సమాచారం. ఆ వీడియోలన్నీ అతడి ఫోన్లో రికార్డ్ చేసుకున్నవే అంటున్నారు. ఎలా బయటపడ్డాయోగానీ.. ఆ వీడియోల పెన్డ్రైవ్లు పలు పార్టీల నేతలకు, జాతీయ స్థాయిలో పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా చేరాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా ఆ వీడియోలు విపరీతంగా వైరల్ కావడం.. ఈ వ్యవహారం మీడియా ద్వారా ప్రపంచమంతా తెలిసిపోయింది. దీంతో జేడీఎస్ ఆ పార్టీతో జట్టు కట్టిన బీజేపీ ఇరుకున పడ్డాయి. ఈ వీడియోల వ్యవహారం పార్టీ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయపరిశీలకులు అంటున్నారు.
ఈ వీడియోలు బయటకు రాగానే కాంగ్రెస్ పార్టీ ధర్నాలు .. ఆందోళనలు చేపట్టింది. ప్రజ్వల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది….ఈ క్రమంలోనే కర్ణాటక మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ బి.కె.సింగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంట్లో ఇద్దరు మహిళా ఎస్పీలు కూడా ఉన్నారు. . వీడియోలకు సంబంధించిన పెన్డ్రైవ్లను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియోలు ఎక్కడివి ? ఎలా బయటకొచ్చాయి ? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. వీడియోల్లో ఉన్న మహిళలతో ప్రజ్వల్ కి ఉన్న సంబంధం ఏమిటి ? తెర వెనుక ఏమి జరిగింది ? అనే విషయాలు కూపీ లాగుతున్నారు . సరిగ్గా ఇదే సమయంలో ప్రజ్వల్ దేశం వదిలి జర్మనీ వెళ్లిపోయారు. ప్రజ్వల్ ని భారత్కు తీసుకొస్తామని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర అంటున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని వివరించారు.. కాగా లైంగిక దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఒక మహిళ ఫిర్యాదు మేరకు మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ కుమారుడు, ఎమ్మెల్యే రేవణ్ణ, మనవడు ప్రజ్వల్ రేవణ్ణలపై హొళెనరసీపుర పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. లైంగిక దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే హసన్ జిల్లాలో వైరల్ అవుతున్నాయి.వీటిపై కూడా విచారణ జరుగుతుంది.
Discussion about this post