ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా మంది కోరుకుంటారు గాని విధి, విధానాలు, అర్హతలేమిటో.., ఎవరిని అడగాలో తెలియక తికమక పడుతుంటారు. అలాంటి వారికోసం ఈ సమాచారాన్ని అందిస్తున్నాం..భారత దేశంలో ఎన్నికల్లో పోటీ చేయాలంటే 25 ఏళ్ల వయసు నిండి, ఖచ్చితంగా భారత పౌరుడై ఉండాలి.
రాజ్యాంగానికి, భారత సార్వభౌమాధికారానికి లోబడి నడుచుకుంటానని ప్రమాణ పత్రం సమర్పించాలి. దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో ఓటు హక్కు ఉండాలి. అభ్యర్థులను ప్రతిపాదించేవారు కచ్చితంగా అదే నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. ఫారం–2 బీలో నామినేషన్ పత్రాలు దఖలు చేయాలి. ఓసీ, బీసీ అభ్యర్థులైతే రూ.10 వేలు డిపాజిట్ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులయితే రూ.5 వేలు చెల్లిస్తే సరిపోతుంది. జనరల్ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులకు సైతం ఈ నిబంధన వర్తిస్తుంది.
కులధ్రువీకరణ పత్రాన్ని నామినేషన్ సమయంలో సమర్పించాలి. స్వతంత్ర అభ్యర్థిని 10 మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. నామినేషన్ సమయంలో నోటరీ చేసిన అఫిడవిట్ సమర్పించాలి. ఇందులో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు సమగ్రంగా చూపించాల్సి ఉంటుంది. అఫిడవిట్లోని అన్ని కాలమ్స్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క కాలమ్ను వదిలేసినా నోటీసులు జారీ చేస్తారు. అప్పటికీ స్పందించకపోతే నామినేషన్ను తిరస్కరిస్తారు. ఒక వ్యక్తి నాలుగు సెట్ల నామినేషన్ను దాఖలు చేయవచ్చు. డిపాజిట్ మాత్రం ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది. నామినేషన్ దాఖలు గడువు ముగిసేలోపు నాలుగు సెట్ల నామినేషన్ను ఏ రోజైనా దాఖలు చేయవచ్చు.
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు రూ.40 లక్షలు, లోక్ సభకు రూ. 95 లక్షలు వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చు మొత్తాన్ని ప్రత్యేకంగా ప్రారంభించిన ఖాతా ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. పోటీచేసే అభ్యర్థుల ప్రచార వాహనానికి సంబంధించి అనుమతి తప్పకుండా పొందాలి.
కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారం-26 నోటరైజ్డ్ అఫిడవిట్లో అన్ని వివరాలను నమోదుచేయాల్సి ఉంటుంది.
అలాగే పోటీ చేసే అభ్యర్థి డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ వెనక్కి రావాలంటే చెల్లిన ఓట్లలో కనీసం 1/6వంతు ఓట్లు పొందాలి. అంటే 100కు దాదాపుగా 17 ఓట్లు పొందాలి. అలా పొందిన అభ్యర్థులకు డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు. లేదంటే అభ్యర్థులకు డిపాజిట్ తిరిగి రాదు. దీన్నే డిపాజిట్ గల్లంతు అంటుంటారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల గుర్తులు అభ్యర్థులకు రావాలంటే ఏ ఫారం, బీ ఫారం కావాల్సి ఉంటుంది. పార్టీ తన అభ్యర్థిగా ఎవరినైతే ఎంపిక చేస్తుందో.. వారికి బీ ఫారం అందిస్తారు. బీ ఫారం అందించే వ్యక్తికి ముందుగా ఇచ్చేది ఏ ఫారం. ఏ అభ్యర్థినైతే పార్టీ ఎంపిక చేసి ఏ ఫారం అందిస్తుందో వారికి మాత్రమే తర్వాత బీ ఫారం అందిస్తారు. ఏ ఫారం అందుకున్న పార్టీ అభ్యర్థి ముందుగా తనకు లభించిన ఏ ఫారంను ఎన్నికల అధికారులకు సమర్పిస్తారు. తద్వారా ఎన్నికల గుర్తును బదలాయిస్తారు.
Discussion about this post